దేశం మొత్తానికీ ఉచిత వ్య‌వ‌సాయ విద్యుత్: కేసీఆర్

దేశం మొత్తానికీ ఉచిత వ్య‌వ‌సాయ విద్యుత్.. ఇది అబ‌ద్ధ‌మైతే త‌క్ష‌ణం రాజీనామా: కేసీఆర్
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ ఎస్ ఆవిర్భ‌వించిన త‌ర్వాత ఐదోసారి మ‌హారాష్ట్ర‌లో స‌భ పెట్టిన ఆయ‌న‌.. తాజాగా ఔరంగాబాద్‌లో ప్ర‌సంగించారు. ఆద్యంతం హిందీలో మాట్లాడిన కేసీఆర్‌.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. అదేస‌మ‌యంలో మ‌హారాష్ట్ర స‌ర్కారుకు కొన్ని స‌వాళ్లు రువ్వారు. అలానే కొన్ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు కూడా చేశారు. దేశం మొత్తం రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చ‌ని.. తాను అధ్య‌య‌నం చేయించాన‌ని.. కేసీఆర్ చెప్పారు. ఇది త‌ప్ప‌ని ఎవ‌రైనా నిరూపిస్తే.. త‌న ముఖ్య‌మంత్రి పీఠానికి వెంట‌నే రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ప్ర‌తి ఇంటికీ తాగునీరు
ఈ దేశంలో సమృద్ధిగా నీటి వనరులు ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. సాగు యోగ్యత ఉన్న భూములకు నీరు అందించాల్సి న అవసరం ఉందని తెలిపారు. కానీ ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవని విమర్శించారు. నిజాయతీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యమని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నీరు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో ఐదేళ్లలోపు ప్రతి ఇంటికి నీరిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదని వివరించారు.

అప్ప‌ట్లో అలా.. ఇప్పుడు ఇలా..
ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ రాకముందు రోజుకు 3 గంటలే కరెంటు ఉండేదని.. అదీ నమ్మకం లేదని కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో 24 గంటలు సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేయవచ్చని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు విద్యుత్ సరఫరా అందించే వనరులు ఉన్నాయని.. సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని తెలిపారు.

అన్నీ ప్రైవేటుకా!
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తాము వచ్చాక వాటిని తిరిగి ప్రభుత్వపరం చేస్తామని పేర్కొన్నారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకుందామని అన్నారు. మహారాష్ట్రలో వనరులు ఉన్నాయని.. పాలనా సామర్థ్యం ఉన్న అధికారులు ఉన్నారని వివరించారు. ఇక్కడ ఎందుకు తెలంగాణ తరహా పథకాలు రావట్లేదని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాలు అవసరమని వెల్లడించారు. అంతకు ముందు కేసీఆర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ విమానాశ్రయం నుంచి నేరుగా మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్‌ నివాసానికి వెళ్లారు.