ష‌ర్మిల‌కు.. 14 రోజుల రిమాండ్‌.. చంచ‌ల్‌గూడకు త‌ర‌లింపు

విధి విచిత్రం అంటే.. ఇదే! గ‌తంలో త‌న అన్న ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్న చంచ‌ల్‌గూడ జైలుకే ఆయ‌న సోద‌రి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలను పోలీసులు త‌ర‌లించారు. నాంప‌ల్లి స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు మేర‌కు ఆమెను 14 రోజుల‌ రిమాండ్ నిమిత్తం పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రిమాండ్‌పై ష‌ర్మిల త‌ర‌ఫున న్యాయ‌వాదులు బెయిల్ పిటిషన్ వేయగా.. విచారణ మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. దీంతో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు.

అంతకు ముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆమెను ప్రవేశపెట్టారు. షర్మిల తరపున వాదించిన న్యాయవాది.. నోటీసులివ్వకుండానే షర్మిలను అడ్డుకున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటికు వెళ్లనివ్వట్లేదని అన్నారు. షర్మిల విషయంలో పోలీసులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని కోర్టులో వాదించారు. షర్మిలను ఎస్ఐ ప్రైవేటు భాగాల్లో తాకే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు ఆమె.. చేయి విరిచే ప్రయత్నం చేశారని కోర్టుకు వివరించారు. పోలీసులు కొట్టారని.. ఆ క్రమంలోనే షర్మిల పోలీసులు తోసేశారని అన్నారు.

పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని అన్నారు. పోలీసులపై చేయిచేసుకుంటే తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. వేగంగా కారు పోనివ్వాలని షర్మిల డ్రైవర్‌కు సూచించారని వివరించారు. దీంతో కారు తగిలి కానిస్టేబుల్ కాలుకు గాయమైందని కోర్టులో వాదించారు. గతంలో ఆమెపై కేసులు ఉన్నాయని వివరించారు. ఇరుప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌మూర్తి ఓ అరగంట పాటు తీర్పును రిజ‌ర్వ్ చేశారు. అనంత‌రం 14 రోజుల రిమాండ్ విధించి.. చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు.

అంతా నాట‌కీయ‌త‌!
గ్రూప్ 1 ప‌రీక్ష పేప‌ర్ లీకేజీపై కొన్నాళ్లుగా ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారు. దీనిపై స‌ర్కారు వేసిన సిట్‌ను కూడా త‌ప్పుబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో సిట్ ఆఫీసుకు వెళ్లి నిర‌స‌న తెల‌పాల‌ని సోమ‌వారం ఉదయం వెళ్తున్న షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిపై వైఎస్ షర్మిల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు.. షర్మిలపై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు.

ఆమెపై సెక్షన్ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా 337, రెడ్‌విత్ 34, మరో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ స్టేషన్కు త‌ర‌లించారు. ఈక్ర‌మంలో తన‌ కుమార్తెను చూడడానికి వెళ్లిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఆమె కూడా చేయి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను బలవంతంగా పోలీసులు కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు.