సర్వే.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్

సర్వేయర్ అంటే భూమిని కొలిచి ల్యాండ్ రికార్డ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేవారని అర్థమొస్తుంది. ఏదేనా సర్వే చేసే వారిని కూడా సర్వేయర్ అనొచ్చో లేదో ఖచితంగా చెప్పలేం. కాకపోతే ఇప్పుడు దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న వారిని సరదాగా సర్వేయర్లు అని కూడా సోషల్ మీడియా పిలుస్తోంది. నిత్యం జనంలో తిరుగుతూ వాళ్లు అభిప్రాయ సేకరణ చేసి ఓ నివేదిక రూపొందించి పార్టీలకు అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తున్నారా… లేక పార్టీలకు కావాల్సినట్లుగా రిపోర్టులు ఇస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

తాజాగా ఓ సర్వే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. అదీ సంచలనం కాకపోయినా… టాక్ ఆఫ్ ది స్టేట్ మాత్రం అవుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25 ఎంపీ స్థానాల్లో 24 ఖచితంగా వస్తాయని ఆ సర్వే నిగ్గుతేల్చింది. దానితో కొందరు ముక్కున వేలేసుకున్న మాట వాస్తవం ఎందుకంటే జగన్ పాపులారిటీ హైయ్యస్ట్ పాయింట్ లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి వచ్చిన లోక్ సభా స్థానాలు 22.

ఇప్పుడు జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఏ కంటితో చూసినా కనిపిస్తుంది. గడప గడపకు నిరసనలు, మా నమ్మకం నువ్వే జగన్ కు ఎదురవుతున్న వ్యతిరేకత, స్టిక్కర్లు అంటించవద్దని జనం ఎదురు తిరుగుతున్న వైనం చూస్తే మాత్రం ప్రజాభిప్రాయానికి, ఆ సర్వేకు మ్యాచ్ అవ్వడం లేదు. మరి ఎందుకలా జరుగుతోంది. నిజానికి సర్వే విశ్వసనీయతను ప్రశ్నించాల్సిన అవసరం లేకపోవచ్చు. కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, వివేకానంద రెడ్డి కేసు విచారణ ఫైనల్ స్టేజీకి వస్తుందన్న చర్చ జరుగుతున్న తరుణంలో డైవర్షన్ కోసం ఇలా ఒక సర్వేను జనంలోకి వదిలారన్న అనుమానాలైతే కలుగక మానవు..

తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా పొలిటికల్ సర్వేయర్లు కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఐ-ప్యాక్ లాంటి సంస్థలే సర్వే చేస్తాయని చెప్పుకునే వారు. ఇప్పుడు చిన్న సంస్థలు, వ్యక్తులు కూడా సర్వేయర్లుగా అవతారం ఎత్తేశారు. ఒక పక్క వైసీపీ పార్టీ పరంగా సర్వే చేయిస్తుండగా, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా సర్వే చేయించుకుంటున్నారు. ప్రతీ ఆరు నెలలకు సర్వే చేయించుకునే వారూ ఉన్నారు. గ్రామాలు, వార్డుల ప్రకారం సర్వే చేయించుకునే నేతలు వాటి ఆధారంగా ఇప్పుడు భవిష్యత్తు వ్యూహంపై దృష్టి పెడుతున్నారు.

సర్వేలు చేసే జనం పెరిగిపోయారు. కొందరు జర్నలిస్టులు అసలు ఉద్యోగాలు మానేసి సర్వేయర్లుగా అవతారం ఎత్తారు. ఉద్యోగం చేసే కంటే సర్వేలు చేస్తే ఎక్కువ సంపాదన ఖాయమన్న ఆలోచనతో వాళ్లు అటు వైపు చూస్తున్నారు. పైగా ఇచ్ఛాపురం నుంచి కళ్యాణదుర్గం వరకు అన్ని ప్రాంతాలు తిరిగిన అనుభవం పొందే వీలుందని కూడా కొందరు రంగంలోకి దిగుతున్నారు. ఇదో మంచి వృత్తిగా మారిపోయిందని కొందరు సంబరపడిపోతున్నారు.

రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతుంటే భవిష్యత్తులో ఏదైనా అవకాశం రావచ్చన్న విశ్వాసంతో కూడా కొందరు సర్వేయర్లుగా మారుతున్నారు. ప్రభుత్వంలో పిఆర్ఓలుగా, ఓఎస్డీలుగా, సలహాదారులుగా చేరే అవాకశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు మిత్రులను కలుపుకుపోయి సర్వేయర్ అవతారం ఎత్తిన వాళ్లు కూడా ఉన్నారు. ప్రచారానికి, వ్యూహ రూపకల్పనకు ఉపయోగపడతారన్న ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఈ సర్వేయర్లకు డబ్బులు బాగానే ముట్టచెప్పుతున్నారు. ఏదేమైన సర్వేజనా సుఖినోభవంతు అనే కంటే సర్వేయర్ జనం సుఖినోభవంతు అనాల్సి వస్తోందేమో…