నాడు ప్రజారాజ్యం.. నేడు బీజేపీ

ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు, తులసీ సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు బీజేపీలో చేరారు. రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సమావేశం సందర్భంగా రామచంద్ర ప్రభు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడైన తులసీ సీడ్స్ ఎండీ యోగేష్ చంద్రతో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకకటించారు. ఏపీ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పుకున్నారు..

నాడు ప్రజారాజ్యం అభ్యర్థి

గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో పుట్టిన తులసీ రామచంద్రప్రభు… మద్రాసు ఐఐటీలో చదివారు. ఉద్యోగం చేయకుండా వ్యాపారంలోకి దిగి బాగా రాణించారు. 2009లో చిరంజీవి నేతృత్వంలోని పీఆర్పీలో చేరి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓడిపోయారు. వ్యాపార రంగంలో ఆయన పేరు మారుమోగిపోతూనే ఉంది. ఐదు జాతీయ అవార్డులు పొందిన గుంటూరు వ్యాపారిగా ఆయనకు పేరుంది..

సేవా కార్యక్రమాల్లో అగ్రగామి

కోస్తాంధ్ర జిల్లాలో సేవాకార్యక్రమాలకు రామచంద్రప్రభు ముందుంటారనే పేరుంది. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తుంటారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జిజీహెచ్ ) కు రోజు రెండు వాటర్ ట్యాంకర్ల నీళ్లు అందించే సేవా పథకానికి రామచంద్రప్రభు ఇటీవలే శ్రీకారం చుట్టారు. గుంటూరు వైద్యుల ప్రశంసలు పొందారు..

2024 ఎన్నికల్లో రామచంద్ర ప్రభు గుంటూరు పార్లమెంటు లేదా.. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వ్యాపారులు హిందూత్వవాదాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో అది రామచంద్రప్రభు అభ్యర్థిత్వానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.