బీజేపీలో చేరండి..మంచి ఫ్యూచ‌ర్‌..: జేడి కు వెంక‌య్య స‌ల‌హా?

మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కులు వెంక‌య్య‌నాయుడును సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ వీవీ ల‌క్ష్మీ నారాయ‌ణ క‌లిశారు. శుక్ర‌వారం ఉద‌యం..విశాఖ బీచ్ రోడ్‌లో మార్నింగ్ వాక్ కోసం.. వ‌చ్చిన వెంక‌య్య‌తో ల‌క్ష్మీనారాయ‌ణ అక్క‌డే భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ.. రాగి జావ తాగారు. కొద్ది దూరం క‌లిసి న‌డిచారు. ఈ సంద‌ర్భంగా ఏపీ రాజ‌కీయాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ క‌ర‌ణ వంటి అంశాలు వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో తానుచేసేది ఏమీలేద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం చేతిలో ఉంద‌ని.. డెలిగేష‌న్‌తో వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపితే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని ఆయ‌న ల‌క్ష్మీనారాయ‌ణ‌కు సూచించిన‌ట్టు తెలిసింది. కాగా.. ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్ప‌టికే హైకోర్టులో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మితే..ప్ర‌జ‌లే కొనుగోలు చేసేలా.. ఆయ‌న ఒక సూత్రాన్ని కూడా తెర‌మీదికి తెచ్చారు. ఆయా విష‌యాల‌ను వెంక‌య్యకు వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

ఇదిలావుంటే.. రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న కూడా వారిమ‌ధ్య వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా తాను ఒంట‌రిగానే విశాఖ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్న‌ట్టు ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పార‌ని తెలిసింది. దీనికి వెంక‌య్య నాయుడు స్పందిస్తూ.. మీలాంటి వారికి బీజేపీ స‌రైన వేదిక అవుతుంద‌ని..ఎలాంటి అవినీతి లేకుండా పాలన సాగుతోంద‌ని.. ఎంతో మంది బ్యూరోక్రాట్లు బీజేపీలో చేరి.. మంచి భ‌విష్య‌త్తు పొందుతున్నార‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై ల‌క్ష్మీనారాయ‌ణ మౌనంగా నే ఉండిపోయార‌ని తెలిసింది. మ‌రి భవిష్య‌త్తులో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.