విజయసాయి మారాడు.. వైసీపీ మారలేదు

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మైక్ అందుకున్నారంటే చాలు.. రాజకీయాలు దిగజారిపోయాయి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాగే విలువల గురించి కూడా ఆయన మాట్లాడని రోజంటూ ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు, అలాగే అధికారంలోకి వచ్చాక కూడా ఆయనది ఇదే పాట. ఆయన మైక్ పట్టుకుని ఇలా సూక్తులు వల్లిస్తుంటే.. ఇంకో పక్క సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు బూతు పురాణంతో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుంటారు. అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి దారుణమైన బూతులు, అసభ్యకరమైన పదజాలంతో పడే ట్వీట్లు చూసి.. ఇంత దిగజారుడుతనమా అని జనాలు తలలు పట్టుకుంటూ ఉంటారు.

వైసీపీని సపోర్ట్ చేసే వాళ్లలో కూడా కాస్త సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్లు తట్టుకోలేని విధంగా ఉంటాయి వాళ్ల ట్వీట్లు. ఊరూ పేరూ లేని వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పెడితే ఓకే.. కానీ ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఇలాంటి పోస్టులు పడితేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. బుధవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పడ్డ ట్వీట్ చూస్తే రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడుతనం ఉండదనే అనిపిస్తుంది. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల మీద వేసిన ఒక చీప్ కార్టూన్‌ పోస్ట్ చేసి.. దానికి “కుట్రపూరిత రాజకీయ రణక్షేత్రంలో బాబుకి బాబే సాటి. రాజకీయ సన్యాసానికి దగ్గర పడుతున్న బాబోరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని వ్యాఖ్య జోడించారు. ఒక పార్టీ అధికారిక హ్యాండిల్లో.. దేశంలోనే అత్యంత సీనియర్ అయిన రాజకీయ నాయకుడి పుట్టిన రోజు నాడు ఇలాంటి ట్వీట్ పడిందంటే ఆ పార్టీ శైలి ఏంటన్నది ఒక అంచనాకు రావచ్చు.

ఇక వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవిలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి ట్వీట్‌ను కూడా ఒకసారి చూద్దాం. “నలభై ఏళ్ల ఇండస్ట్రీ, 420 బిరుదాంకితులు, శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి సారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఏదో చేయాలని పగతో రగిలిపోతూ, ఏమీ చేయలేక, చేసేదేమీ లేక, చేతులు పిసుక్కుంటూ, రాబోయే కాలంలో జగనన్న జనరంజక పాలనను చూస్తూ శేష జీవితం గడపాలని కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు” అని పోస్ట్ పెట్టాడు. ఇది వెరిఫైడ్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టు. ఇవన్నీ జగనకు నచ్చకుండా, ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పడే పోస్టులు కావని అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ రాజకీయాలు దిగజారిపోయాయని.. తానొక్కడినే విలువలు పాటిస్తున్నానని జగన్ చెప్పుకోవడం వింతల్లోకి వింత.