ఆ రోజు వివేకా హైద‌రాబాద్ వెళ్లి ఉంటే.. : ద‌స్త‌గిరి

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ఆయ‌న కారు డ్రైవ‌ర్‌.. ద‌స్త‌గిరిపై వైసీపీ నాయ‌కులు ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయినా.. కూడా ద‌స్త‌గిరి ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాను చెప్పాల‌నుకున్న‌ది మ‌రింత ధాటిగా చెబుతున్నారు. తాజాగా వివేకా హ‌త్య ఎలా జ‌రిగింతో మ‌రింత వివ‌రంగా ఆయ‌న చెప్పాడు. మంగ‌ళ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. అస‌లు వివేకా కేసులో ఎక్క‌డ‌.. ఎప్పుడు ఏం జ‌రిగిందో పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

సూది మందుతో చంపాల‌నుకున్నాం.. కానీ

వివేకాను చంపాలని నెల రోజుల ముందే ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో ప్లాన్ వేశాం. ముందు సూదిమందు ఇచ్చి ప్ర‌శాంతంగా చంపాల‌నుకున్నాం. కానీ, గొడ్డలితోనే చంపాల‌ని ఎర్ర‌గంగి రెడ్డి ప‌ట్టుబ‌ట్టాడు. 2019 మార్చి 9, 10 తేదీల్లో చంపాలని ముందుగా అనుకున్నాం. మార్చి 14 రాత్రి చంపాలనుకోలేదు. ఆరోజు మధ్యాహ్నమే నిర్ణ యించుకుని రాత్రి హత్య చేశాం. వివేకాను నలుగురం కలిసి చంపుదామని ఎర్రగంగిరెడ్డి చెప్పాడని.. డబ్బులు కూడా వస్తాయని తెలిపాడని తెలిపాడు. వివేకా ఇంటి వద్ద ఉన్న కుక్కను ముందు చంపేశాం.

హైదరాబాద్ వెళ్లి ఉంటే..
మార్చి 14న ఎర్రగంగిరెడ్డి వివేకాతో కలిసి జమ్మలమడుగు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆరోజు తన బావమరిది శివప్రకాశ్‌రెడ్డి మనవరాలు పుట్టిన రోజు ఉందని.. హైదరాబాద్‌ వెళ్తున్నానని వివేకా ఎర్రగంగిరెడ్డికి చెప్పారు. వెళ్లొద్దని.. ఈ రోజు కొన్ని విషయాలు ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడుకుందామని చెప్పడంతో అందుకు వివేకా ఒప్పుకొని హైదరాబాద్‌కు వెళ్లే ప్రోగ్రాం రద్దు చేసుకున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చా. నేను, సునీల్‌యాదవ్‌ వివేకా ఇంటి సమీపంలో కూర్చుని మందు తాగాం. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి వెనుక ప్రహరీగోడ దూకి గార్డెన్‌ వైపు ఉన్న డోర్‌ను తట్టడంతో ఎర్రగంగిరెడ్డి డోర్‌ తీశాడు. మేం ఇంట్లోకి వస్తూనే వివేకానందరెడ్డి చూసి ఈ టైంలో ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఏదో సైట్‌ పంచాయితీకి వచ్చారని.. ఆ డబ్బులు ఇవ్వాలని సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి అడిగారు. ఇవ్వనని చెప్పాను కదా అని వివేకానందరెడ్డి అనడంతో.. సునీల్‌ వల్గర్‌గా మాట్లాడుతూ ఆయన ముఖంపై పిడిగుద్దులు గుద్డాడు. ఆయన కిందపడిపోగానే.. సునీల్‌ ఆయన ఛాతీపై కూర్చొని బలంగా పిడిగుద్దులు గుద్దాడు. తర్వాత ఉమాశంకర్‌రెడ్డి, మేం గొడ్డలితో న‌రికేశాం. నిజానికి ఆ రోజు వివేకానంద‌రెడ్డి హైద‌రాబాద్ వెళ్లి ఉంటే బ‌తికిపోయేవారు.