మా ప్ర‌భుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారు: వైవీ

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ, ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సంచ‌లన వ్యాఖ్య లు చేశారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కూలిపోవాల‌ని… కొంద‌రు కోరుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. మ‌రి కొంద‌రు కూల్చేయాల‌ని కూడా చూస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అందుకే ప్ర‌భుత్వంపై కొన్ని ప‌త్రిక‌లు , మీడియా సంస్థ‌లు ప‌నిగ‌ట్టుకుని క‌క్ష పూరిత రాత‌లు రాస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో మీడియాలో వైవీ మాట్లాడారు.

తాజాగా ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌రెడ్డిల‌ను సీబీఐ విచారించ‌డం, భాస్క‌రరెడ్డిని అరెస్టు చేయ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో బెంగ‌ళూరుకు చెందిన లాబీయిస్టు, జ్యోతిష్యుడు కూడా అయిన విజ‌య‌కుమార్ రెండు రోజుల కింద‌ట హ‌ఠాత్తుగా(అదే రోజు అవినాష్ తండ్రిని సీబీఐ అరెస్టు చేసింది) మైసూరు నుంచి విమానంలో తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్‌ నివాసానికి వ‌చ్చారు. అయితే.. దీనిపై ప‌లు ప‌త్రిక‌ల్లో లాబీయింగ్ కోస‌మే ఆయ‌న వ‌చ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై తాజాగా వైవీ రియాక్ట్ అవుతూ.. 2007 నుంచి త‌న‌కు విజ‌య్‌కుమార్ తెలుసున‌న్నారు. ఆయ‌న‌.. వ‌చ్చింది లాబీయింగ్ చేసేందుకు కాద‌ని.. సీఎం జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించేందుకు మాత్ర‌మే వ‌చ్చార‌ని చెప్పారు. ఒక్క విజ‌య‌కుమారే కాకుండా.. అనేక మంది స్వాములు నిత్యం సీఎం జ‌గ‌న్‌ను క‌లుస్తుంటారని.. దీనిని లాబీయింగ్ అన‌డం స‌రికాద‌ని అన్నారు. విజ‌య‌కుమార్ చాలా సింపుల్‌గా ఉంటార‌ని చెప్పారు.

రామోజీరావు వియ్యంకుడు విశ్వేశ్వ‌ర‌రావు వ‌చ్చిన విమానంలోనే విజ‌య‌కుమార్ కూడా వ‌చ్చార‌ని చెప్పా రు. మార్గ‌ద‌ర్శి కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకు విజ‌య‌కుమార్‌ను తెచ్చుకున్న‌దే రామోజీరావు అని ఎదురు దాడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీటీడీపై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. స్వామీజీ విజ‌య‌కుమార్‌ ఆధ్వ‌ర్యంలో రామోజీ గృహ‌ప్ర‌వేశం జ‌ర‌గ‌లేదా? అని వైవీ నిల‌దీశారు.