కేసీయార్ బ్యాక్ స్టెప్ వేసినట్లేనా ?

జాతీయ రాజకీయాల్లో అల్లల్లాడించేస్తానని ఆ మధ్య గోలగోల చేసిన కేసీఆర్ ఎందుకని హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు ? ఈ ముఖ్యమంత్రని, ఆ ముఖ్యమంత్రని వరుసగా పర్యటనలు, భేటీలతో బాగా బిజీగా కనిపించిన కేసీఆర్ ఇపుడు ఎక్కడా చప్పుడు చేయలేదు. కేసీయార్ పోషిస్తారని అనుకున్న పాత్రను బీహార్ సీఎం నితీష్ కుమార్ పోషిస్తున్నారు. వరుసబెట్టి వివిధ పార్టీల అధినేతలను, సీనియర్ నేతలతో భేటీలవుతున్నారు.

ఇంతలో ఎంత మార్పు ? కేసీయార్ వైఖరిలో ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిణామాలే అని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే కూతురు కవితను ఈడీ విచారణకు పిలిపించిందో అప్పటినుండే కేసీయార్ దూకుడు తగ్గినట్లుంది. విచారణకు పిలిపించిన ప్రతిసారి అరెస్టు ఖాయమని మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దాంతో కేసీయార్ కాస్త డల్ అయినట్లే అనిపించింది. ఈమధ్యలో మహారాష్ట్రలో ఒకటి రెండు బహిరంగ సభలు నిర్వహించటం మినహా ఇంకెవరితోను భేటీలు కాలేదు.

నాన్ ఎన్డీయే. నాన్ యూపీఏ కూటమికి సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటుచేయాలని ఆ మధ్య కేసీయార్ చాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్రలో శరద్ పవార్, ఉత్థవ్ థాక్రే, బీహార్లో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ లాంటి వాళ్ళతో చాలా భేటీలు జరిపారు. అప్పట్లో ఎంత హడావుడి చేశారో ఇఫుడంతా వెనక్కు తగ్గారు. కారణాలు ఏమిటంటే అందరికీ పైకి కనిపిస్తున్న కూతురు కేసుతో పాటు అంతర్గతంగా మరోటి కూడా ఉందట.

అదేమిటంటే క్రెడిబులిటి. జాతీయ రాజకీయాల్లో చొచ్చుకుపోవాలంటే క్రెడిబులిటి చాలా అవసరం. ఆ క్రెడిబులిటీయే కేసీయార్ లో లోపించింది. ఎప్పుడెవరితో ఎలాగ వ్యవహరిస్తారో కేసీయార్ ను అంచనా వేయటం కష్టం. మాటకు కట్టుబడుండే రకం కాదు. అందుకనే ముఖ్యమంత్రులను, సీనియర్ నేతలను కేసీయార్ వెళ్ళి కలిశారు కానీ ఎవరూ వచ్చి కేసీయార్ ను కలవలేదు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి కలిసినా పెద్దగా ఉపయోగముండదు. అందుకనే కొంత సమయం తీసుకుని పరిస్ధితులు అనుకూలించిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించవచ్చని కేసీయార్ వెనకడుగు వేసినట్లు పార్టీవర్గాల టాక్.