ఎంపీ అవినాశ్ కు డ్రైవర్ దస్తగిరి సవాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందన్నది తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీలో రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే.. ఆదివారం పులివెందులలో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డినే. ఆదివారం సాయంత్రం వేళలో సీబీఐ నుంచి తాఖీదులు అందుకున్న అవినాశ్.. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేదు.

ఇదిలా ఉంటే.. ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ కేసులో నిందితుడు కమ్ అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం తప్పించి మరేమీ ఆధారాలు లేవని అవినాశ్ వాదిస్తున్నారు. దస్తగిరిని సీబీఐ చిత్రహింసలకు గురి చేసి తమ పేర్లను చెప్పినట్లుగా వాదించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోపణల నేపథ్యంలో దస్తగిరి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన సవాలు విసిరారు. వివేకా హత్య కేసులో ఎదుర్కొంటున్న ఆరోపణలు తేలి.. జైలుకు పంపితే వెళతారా? ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సూటి సవాలు విసిరాడు. తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని పొంచి ఉందన్నారు.

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారటాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారని చెప్పిన దస్తగిరి.. ‘‘మరి నేను అప్రూవర్ గా మారే సమయంలో అవినాశ్ రెడ్డి లాంటోళ్లు ఎందుకు విమర్శించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు. మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు. ఇప్పుడు మాత్రం చెడ్డోడు అయ్యాడా? సునీత నుంచి కానీ సీబీఐ నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బు తీసుకున్నది లేదు. అలా తీసుకున్నట్లు రూపాయి చూపించినా.. జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధం’’ అని పేర్కొన్నారు.

ఎర్ర గంగిరెడ్డి చెబితే.. డబ్బులకు ఆశపడి హత్య చేశామని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదన్నారు. ‘‘పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రాంసింగ్ ను మార్చేశారు. రామ్ సింగ్ మార్చితే కొత్త అధికారి కొత్త కోణంలో విచారిస్తారా? వివేకా కేసులో మీ పాత్ర ఉందని తెలుసు కాబట్టే.. ఏ అధికారి అయినా ఒకేలా దర్యాప్తు చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేశానని.. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి సిద్ధమైనట్లు గా దస్తగిరి పేర్కొన్నారు.
తనను పారిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. కానీ తానెక్కడికి పారిపోనని పేర్కొన్నారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నారన్న దస్తగిరి.. ‘‘నేను తప్పు చేస్తే కచ్చితంగా జైలుకు వెళతాను. మరి మీరు (అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి) తప్పు చేస్తే జైలుకు కూడా వెళ్తాను. మరి.. మీరు తప్పు చేసినట్లు రుజువైతే.. రాజీనామా చేస్తారా? మీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ సవాలు విసిరారు. తాను పులివెందుల వైఎస్ జయమ్మ కాలనీలోనే ఉన్నానని.. ఎక్కడికి పారిపోలేదని దస్తగిరి స్పష్టం చేశారు.