మార్కాపురం ఫ్యాన్స్ అంతర్గత పోరు

ఫాన్ పార్టీలో ఇప్పుడు టీడీపీ భయం కంటే అంతర్గత పోరు ఎక్కువైంది. ప్రతీ నియోజకవర్గంలోనూ రెండు మూడు ముఠాలు పనిచేస్తూ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పాచికలు వేస్తూ.. సిట్టింగులపై ఆరోపణలు సంధిస్తున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డికి సొంత పార్టీ నేతలతోనే తలనొప్పి మొదలైంది.పార్టీలో ప్రత్యర్థులు ఆయనపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి వెయ్యి కోట్ల విలువైన భూములు కబ్జా చేశారంటూ వైసీపీకి చెందిన ఓ నాయకుడు ఆరోపణలు సంధించారు. పైగా దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కూడా కోరారు. దీనితో నాగార్జున రెడ్డి వ్యవహారం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

తండ్రి కెపి.కొండారెడ్డి వారసత్వంగా కుందురు నాగార్జునరెడ్డి 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ కండువాకప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో అప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జంకె వెంకటరెడ్డిని పక్కన పెట్టి వైసీపీ అధిష్టానం నాగార్జున రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికల్లో నాగార్జునరెడ్డి గెలుపొందిన తరువాత మార్కాపురం వైసీపీలో గ్రూపు పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిట్టింగ్ స్థానం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఒక వర్గంగా, సత్తెనపల్లి నియోజక వర్గం వైసీపీ పరిశీలకుడు వెన్నా హనుమారెడ్డి ఒక వర్గంగా, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మరో వర్గంగా ఏర్పడ్డారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఎమ్మెల్యే అయితే, అతని సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మామ, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డి షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని వైసీపీలోని ప్రత్యర్థులు తాడేపల్లికి క్యూకట్టారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యేతో పాటూ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ వైసీపీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు.

నిజానికి కుటుంబ పెత్తనం వద్దంటూ జగన్ ఓ సారి నాగార్జున రెడ్డికి హితబోధ చేశారు. అయినా ఒరిగిందేమీ లేదు.. మార్కాపురం నియోజక వర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రూపు పాలిటిక్స్ తాజాగా సీఎం జగన్ పర్యటనతో బహిర్గతమయ్యాయి. ఈనెల 12న ఈబిసి నేస్తం రెండో విడత నిధులు విడుల చేసేందుకు సీఎం జగన్ మార్కాపురంలో పర్యటించారు. అయితే మార్కాపురంలో తనకి వ్యతిరేక వర్గంగా ఉన్న నాయకులు సీఎం జగన్ ని కలవకుండా చేసేందుకు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటూ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మహానటుడు అయితే….ఆయన తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి మార్కాపురం నియోజక వర్గంలో గ్యాంగ్ స్టర్ నయీంగా మారాడని వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే, అతని సోదరుడి భూకబ్జాలపై హెకోర్టులో కేసు వేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహనరెడ్డికి మావోయిస్టులో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

ఎమ్మెల్యేపై వచ్చిన తాజా ఆరోపణలను తాడేపల్లి ప్యాలెస్ సీరియస్ గా తీసుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే మూకుమ్మడి ఆరోపణలు పార్టీకి తలనొప్పిగా మారాయి. టీడీపీ వాటిని ప్రచారాస్త్రంగా చేసుకోకముందే జాగ్రత పడతారో లేదో మరి..