కోడిక‌త్తికి-అలిపిరి ఘ‌ట‌నకు సంబంధ‌మేల నాయ‌కా?!

రాజ‌కీయాల్లో ఏదైనా చేయొచ్చు.. దేనినైనా ఎలాగైనా.. మ‌లుపు తిప్ప‌చ్చు.. అనే మాట‌ను వైసీపీ నాయ‌కులు నిజం చేస్తున్నా రని అంటున్నారు విశ్లేష‌కులు. తాజాగా ఏపీలో కోడిక‌త్తి కేసు వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. అప్పుడెప్పుడో 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆ పార్టీ అభిమాన‌ని, జ‌గ‌న్‌కు మ‌రింత అభిమాన‌ని చెప్పుకొన్న శ్రీనివాస‌రావు అనే యువ‌కుడు కోడిక‌త్తితో దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిని అప్ప‌ట్లో వైసీపీ రాజ‌కీయంగా వాడుకుంది. త‌న‌పై ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేయించారంటూ.. టీడీపీ పై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశారు.

క‌ట్ చేస్తే.. ఈ కేసును సుదీర్ఘ‌కాలం విచారించిన ఎన్ఐఏ అధికారులు అస‌లు టీడీపీకి, ఈ కేసుకు సంబంధం లేద‌ని.. అంతేకాదు.. అస‌లు కుట్రే కాద‌ని.. తేల్చి చెప్పింది. ద‌రిమిలా ఇప్పుడు వైసీపీ వ‌ర్సెస్ టీడీపీల మ‌ధ్య మాటల యుద్ధం.. రాజ‌కీయ యు ద్ధంమ‌రింత పెరిగాయి. ముందుగా ఈ విష‌యంపై స్పందించిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కోడిక‌త్తికి – 2003లో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు పై తిరుప‌తిలోని అలిపిరిలో మావోయిస్టులు జ‌రిపిన దాడికి లింకు పెట్టారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు రాజ‌కీయ మంట‌లు రేపుతున్నాయి.

బొత్స ఏమ‌న్నారంటే.. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి వాస్తవమని.. ఆ దాడిని స్వయంగా ఆయనే చేయించుకున్నారనే భావనను టీడీపీ నేత‌లు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని అన్నారు. తిరుపతి అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని.. రాజకీయ లబ్ధి కోసం ఆయనే ఆ దాడి చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. కోడికత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో అలా చేశాడో తెలియాల్సి ఉందన్నారు. జగన్‌పై జరిగిన ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే త‌మ‌ డిమాండ్‌ అని చెప్పారు.

అయితే.. ఇలా న‌క్స‌ల్స్ దాడికి-కోడిక‌త్తి కేసుకు ముడిపెట్ట‌డం ప‌ట్ల టీడీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నేరస్తులకు జగన్ రెడ్డి అనుచరుడు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి సెల్‌ఫోన్లు ఇచ్చాడని టీడీపీ నేత‌లు ఆరోపించారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్, పరిటాల రవి హంతకులతో జగన్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించారు. కోడికత్తి శ్రీను గానీ, అతని కుటుంబం గానీ టీడీపీలో లేదని, అలిపిరి బాంబు బ్లాస్ట్ కేసును కోడికత్తి కేసుతో ముడిపెట్టడం బోడిగుండుకు మోకాలికి ముడివేయడమేనని టీడీపీ దుయ్య‌బ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి బొత్స చేసిన వ్యాఖ్య‌లు.. ఇంకెన్ని ర‌కాలుగా మ‌లుపు తిరుగుతాయో చూడాలి.