కేంద్రం బీఆర్ఎస్, పవన్ గాలి తీసేసిందా ?

ఒకేసారి బీఆర్ఎస్ నేతలతో పాటు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాలిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అత్యుత్సాహం చూపిన ఫలితంగా వీళ్ళు పరువు పోగుట్టుకోవాల్సొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమై ముందుకెళ్ళటం లేదని చెప్పారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ని బలోపేతం చేయటమే తమ ధ్యేయమన్నారు.

ఎప్పుడైతే కులస్తే ప్రకటించారో వెంటనే క్రెడిట్ వార్ మొదలైపోయింది. బీఆర్ఎస్ మంత్రులు కేటీయార్, హరీష్ రావు, ఎంఎల్ఏలు, ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ దెబ్బకు నరేంద్రమోడీ వెనకడుగు వేశారని చెప్పారు. కేసీయార్ అడుగు ముందుకేస్తే ప్రత్యర్ధులు పారిపోవాల్సిందే అన్నట్లుగా సినిమా డైలాగులు కొట్టారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుండి కేంద్రం వెనకడుగు వేయటం అంటే బీఆర్ఎస్ సాధించిన విజయమే అంటూ రెచ్చిపోయారు.

తోట అయితే ఇంకాస్త ముందుకెళ్ళి తొందరలోనే వైజాగ్ లో బీఆర్ఎస్ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించేశారు. ఇక పవన్ కల్యాణ్ కూడా రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ను చూసి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలన్నట్లుగా మాట్లాడారు. జగన్ చేతకానితనం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని గోల గోల చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

సీన్ కట్ చేస్తే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుంచి వెనక్కు తగ్గేది లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ప్రైవేటీకరణ నుంచి వెనక్కు వెళ్ళినట్లు జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమే అని తేల్చేసింది. ఎట్టి పరిస్ధితుల్లోను వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని చాలా గట్టిగా చెప్పింది. నిజంగానే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కు తగ్గితే ఆ విషయం ముందు జగన్ కు తెలీకుండా ఉంటుందా ? కులస్తే ప్రకటనను పట్టుకుని రెచ్చిపోయిన బీఆర్ఎస్ మంత్రులు, పవన్ నుండి అసలు సౌండ్ లేదు. ఒకే దెబ్బకు కేటీయార్, హరీష్, పవన్ గాలిని కేంద్రం తీసేసింది. అందుకనే మళ్ళీ దానిగురించి మాట్లాడటం లేదు.