తెలంగాణ : ఇది మహా సమరం

తెలంగాణా ఎన్నికల్లో ఈసారి మంటలు మండటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీయార్ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకావాన్ని వదులుకోవటానికి ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒకటే రచ్చ చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇవే మాటలు చెబుతున్నారు కానీ దాన్ని జనాలు ఎంతమంది పట్టించుకుంటారన్నది అనుమానమే.

ఇక్కడ విషయం ఏమిటంటే అధికారంలో ఉండటం కేసీయార్ కు బాగా అడ్వాంటేజ్ అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి బాగా కలిసొచ్చే అంశం. అంటే ఎన్నికల్లో నిధుల వరద పారించేందుకు రెండుపార్టీలకు ఎలాంటి కొరతా లేదని అర్ధమైపోతోంది. ఇక్కడ కేసీయార్ కు ఒక సమస్య ఎదురయ్యే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుండి యావత్ యంత్రాంగమంతా రాష్ట్రప్రభుత్వం పరిధిలో నుండి కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళిపోతుంది.

కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధి అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంటే కమీషన్ను అడ్డం పెట్టుకుని నరేంద్రమోడీ ప్రభుత్వం కేసీయార్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ను నియంత్రించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ విషయాలు కేసీయార్ ఊహించకుండా ఉంటారా ? ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల వ్యయంకు సంబంధించి రెండు పార్టీల మధ్య మంటలు మండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్ధక మైపోతుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమైపోతుందో వెంటనే కేసీయార్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి చాలా ఇబ్బందయిపోతుంది. ఇప్పుడు జాతీయరాజకీయాల్లో కేసీయార్ కున్న క్రెడిబులిటి అంతంత మాత్రమే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాల్సిందే. ఇదే సమయంలో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ లో బీజేపీకి ఏమీకాదు కానీ జాతీయస్ధాయిలో మోడీకి ఇబ్బందులు పెరిగిపోవటం ఖాయం. ఇపుడే మోడీకి వ్యతిరేకంగా నానా గోలచేస్తున్న కేసీఆర్ రేపు హ్యాట్రిక్ సాధించిన తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోకుండా ఉంటారా ?