వైసీపీ ఆరు నెల‌ల త‌ర్వాతే అస‌లు ప‌రీక్ష స్టార్ట్‌…!

అవును.. ఇప్పుడు కాదు.. మ‌రో ఆరు మాసాలు తిరిగిన త‌ర్వాత‌.. చూడాలి ఏపీ అధికార పార్టీ వైసీపీ ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఏ అధికార పార్టీ అయినా..ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందో.. నాలుగు మాసాల ముందో .. మేల్కొం టుంది. అప్పుడు ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. దీనివ‌ల్ల అప్ప‌టికే జ‌రిగిపోయిన త‌ప్పులు స‌రిచేసుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెప్ప‌డానికి కుద‌ర‌దు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.

అక్క‌డ బీజేపీ నేత‌లు చేసిన త‌ప్పులు.. అవినీతి వంటివి ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. కానీ, ఏం ప్ర‌యోజ‌నం మ‌రో నెల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌నే అంచ‌నాలు కూడా వ‌చ్చేశాయి. దీంతో క‌మ‌ల నాథులు ఇప్పుడు చేతులు కాలాక అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ, అక్క‌డున్నంత ప‌రిస్థితి ఇక్క‌డ లేక‌పోయినా.. ప్ర‌తిప‌క్షాల జోరు.. హోరు నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌న‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని గుర్తించిన సీఎం జ‌గ‌న్ ఏడాదిన్న‌ర‌కు ముందే మేల్కొన్నారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం వంటి విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌తోపాటు.. గృహ సార‌థులను తీసుకువ‌చ్చారు. ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇప్పుడు జ‌గ‌న‌న్నే మా భ‌విత కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు కూడా చేయ‌నున్నారు. ఇవ‌న్నీ.. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండ‌గానే చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఒక విష‌యం త‌ప్ప‌కుండా చెప్పాలి. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లోనూ.. ప్ర‌భుత్వంపై అనేక మ‌ర‌క‌లు వ‌చ్చాయి. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. బాబు వాటిని ప‌ట్టించుకోలేదు.

తీరా ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి ఇంటెలిజెన్స్ స‌ర్వే నివేదిక‌లు బెంబేలెత్తించాయి. ఇంకేముంది.. అధికారం క‌ష్టం సార్‌.. అని కీల‌క అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. దీంతో చంద్ర‌బాబు అప్ప‌టి ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. “మా వాళ్లు త‌ప్పులు చేశార‌నే అనుకుందాం.. న‌న్ను చూసి ఓటేయండి!” అని వేడుకున్నారు. వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టారు. కానీ, ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌లేదు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వైసీపీలోనూ కొంద‌రు నేత‌లు ఇలా అవినీతి పాల్ప‌డి ఉన్నారని జ‌గ‌న్‌కు కూడా తెలుసు.

అందుకే వారిని స‌రిచేసేందుకు క్షేత్ర‌స్థాయిలో త‌ప్పులు దిద్దుకునేందుకు, ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని త‌గ్గించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే నేత‌ల‌నే ఆయ‌న ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తున్నారు. ఈ ఫ‌లితం వ‌చ్చేందుకు క‌నీసం ఆరు మాసాల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. అందుకే ఆరు మాసాల త‌ర్వాత‌.. చూడాలి వైసీపీ ప‌రిస్థితి ఎలా పుంజుకుంటుందో ? అంటున్నారు ప‌రిశీల‌కులు.