బీఆర్ఎస్ ఆదాయం.. 218 కోట్లు.. మ‌రి వైసీపీ మాటేంటి?

పార్టీప‌రంగా చూస్తే.. అవి స్తానిక పార్టీలు. ఒక రాష్ట్రానికి మాత్ర‌మే ప‌రిమితం. కానీ, ఆదాయం ప‌రంగా చూస్తే.. మాత్రం జాతీయ పార్టీల‌తో పోటీ ప‌డుతున్నాయి. అవే.. వైసీపీ, బీఆర్ఎస్‌, బిజేడీ(ఒడిశా అధికార పార్టీ) ఒక్కొక్క పార్టీ ఆదాయం.. 200 కోట్ల పైగానే ఉంద‌ని స‌ర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) 2021-22 ఏడాదికి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.218 కోట్లను ఆదాయంగా పొందింది. అదే ఒడిశా అధికార పార్టీ బీజేడీ రూ.233.94 కోట్లు పొందింది. అంటే.. ఒక‌ర‌కంగా.. బీఆర్ఎస్ క‌న్నా ఎక్కువే!!

బీఆర్ఎస్ సహా వైఎస్ఆర్సిపీ, టీడీపీ, డీఎంకే, జేడీయూ, ఆప్ వంటి పది ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.852 కోట్లు సంపాదించినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 ప్రాంతీయ పార్టీలకు బాండ్ల ద్వారా రూ.1213 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేసింది.

2021-22కు గాను భారత ఎన్నికల సంఘానికి పార్టీలు తమ ఆడిట్ నివేదికలను సమర్పించాయి. ఆ నివేదికల ప్రకారం.. డీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్), వైఎస్ఆర్సిపీ, టీడీపీ, జేడీయూ, ఎస్పీ, ఆప్, ఎస్ఏడీ, ఎంజీపీ పార్టీలు తమకు బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రూ.852కోట్లుగా బహిర్గతపరిచాయి. వీటన్నింటిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు అత్యధికంగా రూ.318 కోట్లు ఆదాయంగా వచ్చాయి. తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ (218కోట్లు) ఉంది.

కేవలం ఐదు పార్టీల ఆదాయమే(రూ.1024.44 కోట్లు) మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 84.44 శాతంగా ఉంది. వివరాలను వెల్లడించిన 35 పార్టీల్లో 20 పార్టీలు తమ ఆదాయం పెరిగిందని, 15 పార్టీలు తగ్గిందని తెలిపాయి. 2020-21లో వీటన్నింటి ఆదాయం కలిపి రూ.565.42గా ఉండగా.. అది 2021-22కి రూ.1212.70 కోట్లకు చేరింది.

ఒడిశాలో అధికారంలో ఉన్న సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వంలోని బిజు జనతాదళ్(బీజేడీ) కి అత్యధికంగా రూ.233.94 కోట్ల ఆదాయం పెరిగింది. టీఆర్ఎస్‌కు రూ.180 కోట్ల మేర ఆదాయం పెరిగింది. తమ ఆదాయంలో రూ. 190 కోట్లను ఆ పార్టీ ఖర్చు చేయాల్సి ఉంది. ఇక 2021-22 ఏడాదికి అన్ని పార్టీల ఖర్చు కలిపి రూ.190 కోట్లుగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.