దీదీకి జగనన్నకు ఒకే ప్లాన్లు ఇస్తున్న ఐప్యాక్

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఏపీలోని అధికార పార్టీ వైసీపీ కొత్త కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో ఏప్రిల్ 13 నుంచి ప్రజాసమస్యలు వినే కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇంచార్జిలు అంతా ప్రజల్లోకి వెళ్లనున్నారు. జగన్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను విననున్నారు. జగన్ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏప్రిల్ 11 నుంచి ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ స్టిక్కర్లు అతికించే కార్యక్రమం ఒకటి అమలు చేయబోతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడి.. ప్రజల్లో మళ్లీ నమ్మకం పొందడానికి ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది జగన్ ఆలోచన. అందుకోసమే ఐప్యాక్ ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. అయితే… ఇదేమీ కొత్త మోడల్ ఏమీ కాదు, ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోసం కూడా ఐప్యాక్ ఇదే కేంపెయిన్ రన్ చేస్తోంది. అక్కడ ‘దీదీ కే బోలో’ పేరుతో ఈ కార్యక్రమం రన్ చేస్తూ ఆన్‌లైన్, సోషల్ మీడియాలో కూడా ప్రజా సమస్యలు వింటున్నారు.

ఇందుకోసం అక్కడ ప్రత్యేక వెబ్ సైట్, ట్విటర్, ఫేస్ బుక్ సహా సోషల్ మీడియా పేజీలు ఏర్పాటు చేసి దీదీ కీ బోలో అనే క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాగా ఐప్యాక్ పశ్చిమబెంగాల్‌లో మమత బెనర్జీ కోసం ఏ వ్యూహం రచిస్తున్నారో ఇక్కడ జగన్ కోసమూ అదే వ్యూహాలు రచిస్తుండడంతో ఐప్యాక్ వద్ద ఆలోచనలు అయిపోయాయా అనే ప్రశ్న వినిపిస్తోంది. పూర్తిగా భిన్నమైన ప్రజలు, రాజకీయ పరిస్థితులు ఉన్న పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ కోసం ఐప్యాక్ ఒకటే వ్యూహాలు పన్నుతుండడంతో జగన్ వాటిని పట్టుకుని ఈసారి ఎన్నికలు దాటగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో దీదీకే బోలో కార్యక్రమంలో వాడిన లోగో, జగనన్నకు చెబుదాం లోగో దాదాపు ఒకేలా ఉన్నాయి. అలాగే ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్లు ఏపీలో వాడబోతుండగా… పశ్చిమ బెంగాల్‌లో ‘బెంగాల్ తన సొంత బిడ్డనే కోరుకుంటోంది’ అనే అర్థం వచ్చే స్టిక్కర్లు అతికించే కార్యక్రమం చేపట్టారు. ఆ స్టిక్టర్లు.. ఇక్కడ ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లు వాడుతున్నారు. ఈ రెండూ ఒకేలాఉన్నాయి. రంగులో కానీ, డిజైన్‌లో కానీ పెద్ద తేడా లేదు. తేడా అంతే మధ్యలో ఉన్న సీఎం ఫొటో, పార్టీ గుర్తే. అక్కడ మమత ఫొటో ఉండగా ఇక్కడ జగన్ ఫొటో ఉంది. అక్కడ మూడు రెక్కల పువ్వులు రెండు ఉన్న గుర్తు ఉంటే.. ఇక్కడ మూడు రెక్కల ఫ్యాన్ గుర్తు ఉంది. మరి… అరిగిపోయిన ఈ ప్లాన్లతో ఐప్యాక్ ఆంధ్రాలో జగన్‌ను రెండోసారి అధికారంలోకి తేగలరో లేదో ఎన్నికలొస్తేనే తేలనుంది.