కోన రఘుపతి కోపం ఎవరిపైన?

బాపట్ల జిల్లా ఆవిర్భావ సభలో రెండు రోజుల కిందట బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో పార్టీ ఆయనతో క్షమాపణ చెప్పించింది. కోన క్షమాపణలైతే చెప్పారు కానీ తన వాదన కరెక్టేనని అనుచరుల వద్ద అంటుండడంతో పంచాయితీ ఇంకా తెగలేదు. పదిహేనేళ్ల కిందట నిర్ణయమైన నియోజకవర్గాల రిజర్వేషన్లపై కోన రఘుపతి తాజాగా చేసిన వ్యాఖ్యలకు కారణం ఇప్పుడు అక్కడ ఉన్న ఎంపీయేనని ఆయన వర్గీయులు అంటున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ తీరు కారణంగానే రఘుపతి బాపట్ల లోక్ సభ నియోజకవర్గం రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తంచేశారని ఆయన అనుచరులు అంటున్నారు.

ఇటీవల కోన రఘుపతి మాట్లాడుతూ.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో బాపట్ల లోక్ సభ నియోకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చడంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో దళిత సంఘాలు ఆగ్రహించాయి. విపక్ష టీడీపీలోని దళిత నేతలూ రఘుపతి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో కోన మాట్లాడిన వీడియోలు పరిశీలించిన ము‌ఖ్యమంత్రి కార్యాలయం ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

బాపట్ల జిల్లా ఆవిర్భావ సభలో కోన రఘుపతి మాట్లాడుతూ.. బాపట్ల లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం కావడం దురదృష్టకరమననారు. ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం అయిన సంత నూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గాన్ని బాపట్ల పార్లమెంట్ లో కలిపారని, లేకపోతే పొన్నూరుతో కలిసి బాపట్ల ఒసి పార్లమెంట్ గా ఉండేదన్నారు. అంతేకాదు… నెల్లూరు నియోజక వర్గాన్ని ఓసి నియోజక వర్గంగా చేయడం కోసం బాపట్ల ను ఎస్సీ రిజర్వ్ చేశారని ఆరోపించారు. బాపట్ల పార్లమెంట్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడం చారిత్రక తప్పిదమన్నారు.

దీంతో దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని టీడీపీ, బీజేపీకి చెందిన దళిత నేతలు సహా పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి కోన రఘుపతి.. బాపట్ల ఎంపీ సీటు పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద ఆయన దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. బాపట్ల పార్లమెంట్ సీటు ఎస్సీ రిజర్వుడు కావడం దురదృష్టకరమని రఘుపతి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దళితుల పట్ల ఇంతటి వివక్ష ఉన్నవారు ప్రజాప్రతినిధిగా పనికిరారని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఓట్లతో గెలిచిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రఘుపతి చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు. రఘుపతి అలా మాట్లాడుతుంటే మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతుండటాన్ని గుర్తించిన వైసీపీ కోన రఘుపతి వివాదానికి ముగింపు పలకాలని ఆదేశించింది.

అయితే… బాపట్ల జిల్లా ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటల్ని వక్రీకరించి సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేయడం బాధాకరమన్నారు. ఒక రాజకీయపార్టీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చరిత్రను గుర్తుచేస్తూ వివరణ ఇచ్చేక్రమంలో మాట్లాడినట్లు వీడియోలో వివరించారు. తన వ్యాఖ్యలతో బాధపడిన దళితులకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని, తండ్రిని రాజకీయంగా దళితులు ఆదరించి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

అయితే… బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ తన నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికంగా జోక్యం చేసుకుంటున్నారని.. ఆ కారణంగానే సురేశ్‌తో పొరపొచ్చాల కారణంగానే రఘుపతి ఈ వ్యాఖ్యలు చేశారని వినిపిస్తోంది.