మోదీకి మొహం చూపించలేకపోతున్న కేసీఆర్.. ?

ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. రాజకీయంగా రెండు పార్టీల మధ్య విభేదాలుండొచ్చు.. కానీ, ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవడానికి కూడా కేసీఆర్ వెళ్లకపోవడం చర్చకు దారితీస్తోంది. శనివారం మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఈసారీ కేసీఆర్ తీరు అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. మోదీని కేసీఆర్ ఎందుకు ఫేస్ చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. శనివారం మోదీ పర్యటన కోసం సీఎంకు రైల్వే శాఖ లేఖ రాయగా సీఎంకు బదులు మంత్రి తలసాని, ఎమ్మెల్యే పద్మారావు వస్తారని పీఎంవోకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

రాజకీయాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఎన్నికలలో పోటీ పడడం వంటివన్నీ సహజమే. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ కూడా మోదీని విమర్శిస్తుంటారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల పరంగా చూసుకుంటే బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఉప్పు నిప్పు. అందులో ఎలాంటి అనుమానాలు ఎవరికీ లేవు. కానీ.. ప్రధాని మోదీ కార్యక్రమాలకు మమత హాజరవుతుంటారు.

స్టాలిన్ కూడా మోదీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టిన చరిత్రేమీ లేదు. అంతేకాదు.. చెన్నైలో అభివృద్ధి పనుల ప్రారంభానికి మోదీ వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్.. తమిళనాడుకు రావాల్సిన నిధులను కేంద్రం వేగంగా విడుదల చేయాలని మోదీని కోరారు, ఆయన అందుకు సానుకూలంగా స్పందించారు.

మమత, స్టాలిన్ వంటివారు ప్రభుత్వాధినేతలుగా, పార్టీ అధినేతలుగా రెండూ వేర్వేరుగా పాత్ర పోషిస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో కూడా బీఆర్ఎస్ అధినేతగానే వ్యవహరిస్తుంటారు.

సుమారు ఏడాది కాలంగా మోదీ కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఆయన నాలుగుసార్లు మోదీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. శనివారం జరగబోయేది అయిదివది.

నిజానికి విమర్శకులు ఇంతకుముందు కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను బీజేపీకి బీ టీంగా ఆరోపించేవారు. కేసీఆర్ తీరు కూడా అలాగే ఉండేది. బీజేపీ సీఎంలు కూడా పొగడనంతగా మోదీని పొగిడేవారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ వంటి ప్రతి సందర్భంలో మోదీ నిర్ణయాలను కేసీఆర్ శభాష్ అన్నారు. కానీ, ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ విజయం తరువాత కేసీఆర్ పూర్తిగా మోదీపై మండిపడుతున్నారు. మోదీపై కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. దీన్ని బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా తీసుకుంటోంది. వ్యక్తిగత విమర్శలు చేస్తుండడంతోనే కేసీఆర్ నేరుగా మోదీ ఎదుట పడడానికి మొహమాట పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు జాతీయ రాజకీయాలు చేస్తానని, ప్రధాని అవుతానని చెప్తున్న కేసీఆర్ తనది కూడా మోదీ స్థాయే అని ఊహించుకుంటూ మోదీ దగ్గర ఒక సీఎంలా ఉండడానికి అనవసరం భేషజానికి పోతున్నారన్న విమర్శ కూడా ఉంది.