పొత్తుల‌పై బీజేపీ తేల్చ‌క‌పోవ‌డానికి రీజ‌నేంటి?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొలిటిక‌ల్ పొత్తులు తేల్చాల‌న్న‌ది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద్దేశం. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంది కాబ‌ట్టి. ఈ ఏడాదిలో పొత్తులు తేలిపోతే… ఇక‌, ప్ర‌చారం చేసుకోవ‌చ్చనేది ఆయ‌న భావన అయి ఉంటుంది. అయితే.. ఈ విష‌యంలో బీజేపీ పెద్ద‌లు మాత్రం ఉద్దేశ పూర్వంగా వెనుకంజ వేస్తున్నార‌నేది ఢిల్లీ వ‌ర్గాల మాట‌. అందుకే.. ప‌వ‌న్ రెండు రోజుల పాటు. ఢిల్లీలో ఉన్న‌ప్ప‌టికీ అటు ప్ర‌ధాని కానీ, ఇటు అమిత్ షా కానీ పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

దీంతో ప‌వ‌న్ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీన‌డ్డా స‌హా.. కొంద‌రు కేంద్ర మంత్రుల‌తో భేటీ అయి వ‌చ్చేశారు. అయితే బీజేపీ ఎందుకు వెనుకంజ వేస్తోంద‌నేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఈ విష‌యంలో ప్ర‌ధానంగా బీజేపీ మూడు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఏపీపై జాతీయ మీడియా వెలువ‌రుస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. పొత్తుల‌పై తేల్చేందుకు క‌నీసం.. మ‌రో మూడు మాసాల స‌మ‌యం అయినా ప‌ట్టనుంది.

ఎందుకంటే..బీజేపీ ఎప్పుడూ కూడా.. రెండు కీల‌క విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. ఏ రాష్ట్రం లో అయినా.. తాము ఒంట‌రిగా బ‌ల‌ప‌డే శ‌క్తి ఉందా? అనేది చూస్తంది. అలా లేక‌పోతే.. బ‌లంగా ఉన్న పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనేది చూస్తుంది. ఈ రెండు విష‌యాల‌ను చూస్తే..ఏపీలో ఇప్పుడు బ‌లంగా ఉన్న పార్టీ వైసీపీ. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌దు… అని నిర్ణ‌యించుకుంటే.. బీజేపీ ఖ‌చ్చితంగా పొత్తుల‌కు సిద్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు.

2014లోనూ ఇదే జ‌రిగింది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌వ‌నాలు బాగున్నాయ‌ని తెలిసిన త‌ర్వాతే. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అయింది. ఇక‌, ఇప్పుడు బ‌లంగా ఉన్న పార్టీ వైసీపీ. ఈ పార్టీ బ‌ల‌హీనంగా ఉందా? మ‌రోసారి అధికారంలోకివ‌స్తుందా? రాదా? అనేది తేలాలంటే.. మ‌రో మూడు నాలుగు మాసాలు ఆగాల్సిందేన‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారు. పైగా.. ఈలోపు కీల‌క‌మైన క‌ర్నాట‌క‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్నాయి. ఇవి పూర్తికాగానే తెలంగాణ ఎన్నిక‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి ఉంటుంద‌ని.. అందుకే..ఏపీ విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌డం ఎందుక‌ని.. భావిస్తున్న‌ట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇక‌, ఏపీలో బీజేపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే… ఇక్క‌డ బీజేపీకి అనుకున్న విధంగా బ‌లం లేదు. సో.. ఇది కూడా ఒక కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. కాబట్టి వ‌చ్చే ఎన్నిక‌ల పొత్తులు తేలాలంటే.. మ‌రో మూడు నాలుగు నెల‌లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.