Hyderabad అభివృద్ధి పై రీల్‌ కాన్టెస్ట్‌.. ప్రైజ్ మ‌నీ ల‌క్ష‌!

అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ రాజ‌ధాని Hyderabad పై 60 సెకన్ల నిడివితో రీల్‌ తీస్తే.. చాలు.. రూ.ల‌క్ష గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించింది తెలంగాణ ప్ర‌భుత్వం. హైదరాబాద్‌ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రీల్స్‌ కాంటెస్ట్‌’ నిర్వహిస్తోంది. ప్రైజ్‌ మనీ కింద విజేతకు రూ.50,000, ఫస్ట్‌ రన్నరప్‌ రూ.25,000, సెకండ్‌ రన్నరప్‌ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్‌ ప్రైజ్‌ రూ.5వేలు చొప్పున.. మొత్తంగా రూ.ల‌క్ష‌ ఇవ్వనున్నట్టు తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రకటించింది. ఈ నెల 30లోపు ఈ పోటీలో పాల్గొనాల‌ని సూచించింది.

ఇందుకోసం చేయవలసిందల్లా.. హైదరాబాద్‌లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృధ్ధికి అద్దంపట్టే దృశ్యాలను 60 సెకన్ల నిడివి మించకుండా వీడియో తీయాలి. ఆ వీడియోను @DigitalmediaTS ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలి. ఆ తర్వాత వీడియో లింక్‌ను dir_dm@telangana.gov.inకు మెయిల్‌ చేయాలి. ఏప్రిల్‌ 30వ తేదీతో ఈ పోటీ ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://it.telangana.gov.in/contest/లో చూడాలని తెలంగాణ డిజిటల్‌ మీడియా తెలిపింది. మే రెండో వారంలో విజేతలను ప్రకటిస్తారు.

అభివృద్ది ఇలా..

తొమ్మిదేళ్లలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది. నగరంలోని ఎల్బీనగర్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. దశాబ్దం క్రితం హైదరాబాద్‌ వచ్చిన వారు.. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తే కొన్ని ప్రాంతాలను చూసి గుర్తు పట్టలేరు. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ ఖ్యాతిని మ‌రింత పెంచేందుకు.. మ‌రింత ప్ర‌చారం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ పోటీని పెట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇంకెందుకు ఆల‌స్య‌.. మెద‌ళ్ల ప‌దును పెళ్లి.. సెల్ ఫోన్‌ను చేత‌బ‌ట్టి.. రంగంలోకి దిగిపోవ‌డ‌మే!!