అప్పట్లో టీడీపీ మేనిఫెస్టో రాసింది సజ్జలే..

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ అధికార పార్టీలో ఎలాంటి కలకలాన్ని రేపిందన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా వచ్చిన ఫలితాలతో వైసీపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అన్నింటికి మించి అధినేత మాటకు భిన్నంగా వ్యవహరించిన ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం కావటంతోపాటు.. వారి పై వెనువెంటనే వేటు పడింది కూడా. అలా వేటు పడిన వారిలో సీనియర్ నేత.. నలుగురు సీఎంల వద్ద మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. సౌమ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు కానీ.. అవసరమైతే మాస్ కే మాస్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటంలో ఆనం దూకుడుగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఎందుకు టార్గెట్ చేశారు? మీ సమస్యంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోకదా? లాంటి ప్రశ్నలకు ఆనం తనదైన రీతిలో బదులిచ్చారు. బయటకు వచ్చి మాట్లడుతున్నది సజ్జలే అని.. ఆయన చెప్పిన మాటల్నే తాము చెబుతున్నట్లుగా పేర్కొన్నారు.

మేం లెక్కలో లేమని సజ్జల చెప్పారు. సస్పెండ్ చేశామని చెప్పింది ఆయనే.ముడుపుల ఆరోపణలు చేసింది ఆయనే. అసలాయన చెబితేనే సజ్జల చేస్తున్నాడని తెలుసు. కాబట్టి సజ్జలను ఖండిస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన పోయి ఆయనకు చెప్పుకోవాలి. ఆయన ఏమైనే చేస్తే చేయించుకోవాలి. గతంలో టీడీపీ మేనిఫెస్టో రాసిందెవరండి? సజ్జల రామక్రిష్ణారెడ్డి తెలుగుదేశం మేనిఫెస్టో రాయలేదా? ఇవాళ వైసీపీలోకి వచ్చి ఇక్కడ మేనిఫెస్టో నేను చూస్తున్నావు అని అంటున్నావు కదా? వైఎస్ ఉన్న రోజుల్లో ఈ సజ్జల టీడీపీ మేనిఫెస్టో రాయలేదా?” అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం ఎలా అవుతుందని మండిపడ్డారు.

ముడుపులు తీసుకున్నానంటూ తనపై ఆరోపణలు చేసిన సజ్జలపై తాను కోర్టును ఆశ్రయిస్తానని.. పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు ఆనం. ‘సజ్జల మీదనే కోర్టుకు వెళతా. ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను అడిగేది ఒక్కటే. 175 ఓట్లకు 175 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారు. వారికి 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి అన్ని ఓట్లు వచ్చాయి. మరి.. క్రాస్ ఓటింగ్ ఏముంది? అటునుంచి ఇటు జరిగిందని మీరు చెప్పినప్పుడు ఇటునుంచి అటు కూడా క్రాస్ అయ్యాయా? మీరెన్నిముడుపులు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకున్నారు? మీరెన్ని ఆశలు కల్పించారు” అంటూ ప్రశ్నించారు. తన రాజకీయ మజిలీ ఏమిటన్నది అందరితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు ఆనం.