ఏపీలో ముంద‌స్తు ఫ‌లించేనా.. గ‌తం ఏం చెబుతోంది?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ముంద‌స్తు ఎన్నిక‌లు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఈ ఏడాది అక్టోబ‌రులో జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. న‌వంబ‌రులో నే నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని.. డిసెంబ‌రు నాటికి ఎన్నిక‌లు కూడా పూర్త‌యి.. అదే నెల‌లో ప్ర‌భుత్వం కూడా ఏర్ప‌డుతుంద‌ని.. సోష‌ల్ మీడియాలో డేట్ల వారీగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మ‌ని అనుకుంటే.. అస‌లు ఏపీకి ముంద‌స్తు ఎన్నిక‌ల సెంటిమెంటి ఏమేర‌కు ప‌నిచేస్తుంద‌నేది చ‌ర్చ‌.

ఎందుకంటే.. గ‌తంలో రెండు అనుభ‌వాలు ఏపీకి చ‌విచూసింది. ఆ రెండు సార్లు కూడా.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీడీపీ రెండు సార్లూ ఓడిపోయింది. కాంగ్రెస్ ఎప్పుడూ ముంద‌స్తు ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఒక‌సారి అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనూ.. త‌ర్వాత‌.. 2004లో ఒక‌సారి చంద్ర‌బాబు హ‌యాంలోనూ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటిపై భారీ అంచ‌నాల‌తోనే ఇద్ద‌రు నాయ‌కులు కూడా ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. ఫ‌లితం మాత్రం రివ‌ర్స్ అయిపోయింది. దీంతో ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ విఫ‌ల‌మైంది.

మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ ఏ సెంటిమెంటునూ న‌మ్ముకోవ‌డం లేద‌ని అనుకోవాలా? అంటే.. పైకి అలా క‌నిపించినా.. ఆయ‌న‌కు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. సెంటిమెంట్లను బాగానే ఇష్ట‌ప‌డే నాయ‌కుల్లో జ‌గ‌న్ కూడా ఒక‌రు. సో.. ఇప్పుడు ఆయ‌న ఏ ఉద్దేశంతో ముంద‌స్తుకు వెళ్తున్నార‌నేది ప్ర‌ధానంగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగింది. సో.. దీని నుంచి త‌ప్పించుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్త‌న్నారు. అయితే.. దీనికి ముంద‌స్తు ఏమాత్రం స‌రికాద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

ఇప్పుడు జ‌గ‌న్ చేతిలో ఏడాది స‌మ‌యం ఉంది. ఈ ఏడాది కాలంలో అంటే.. ఏప్రిల్ టు ఏప్రిల్ వ‌ర‌కు.. ఆయ‌న త‌న పంథాను కొంత మార్చుకుని.. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌గ‌ల స‌త్తా ఉన్న నాయ‌కుడిగా నిరూపించుకుని.. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం మంచిద‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. పైగా.. ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న నేప‌థ్యంలో వారు యాంటీగా మారే అవ‌కాశం మెండుగా ఉంది. కాబ‌ట్టి ఈ ఏడాది కాలంలో వీరిని కూడా శాంతించేందుకు ప్ర‌య‌త్నిస్తే.. షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లకు వెళ్ల‌డం ద్వారా.. గెలుపు అవ‌కాశాల‌ను చేజేతులా పాడుచేసుకోకుండా చూసుకున్న‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు.