పెగాసస్‌ లాంటి మరికొన్ని సాఫ్ట్‌వేర్‌లు?

మోదీ ప్రభుత్వం చాలాకాలంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోపణ.. ప్రతిపక్షాలు, మీడియాపై నిఘా పెడుతుండమనేది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రహస్యంగా ప్రయోగిస్తుందన్న ఆరోపణను బీజేపీ ఎదుర్కొంటోంది. అయితే, వచ్చే ఎన్నికల కోసం కూడా ప్రతిపక్షాలపై నిఘా తప్పనసరి అవసరమని బీజేపీ భావిస్తోందట.. అయితే, వివాదాస్పద పెగాసస్ కాకుండా అదేస్థాయి సాఫ్ట్‌వేర్ వాడేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం రూ. 100 కోట్లు వరకు ఖర్చు చేయడానికి బీజేపీ రెడీ అవుతోందని టాక్.

పెగాసస్ స్పై వేర్ని 2010లో అభివృద్ధి చేశారు. ఇది ప్రభుత్వ ఏజెన్సీలు ఉపయోగించే సాఫ్ట్ వేర్. అయితే, నవంబర్ 2021లో అమెరికాకు చెందిన వైట్ హౌస్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పెగాసస్ యునైటెడ్ స్టేట్స్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష లీడర్లు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని ప్రయోగించారని, అందుకని దీన్ని తాము బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలిపింది. మోదీ ప్రభుత్వంపైనా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.

దీంతో ప్రత్యామ్నాయంగా మరికొన్ని సాఫ్ట్‌వేర్‌లను బీజేపీ పరీక్షిస్తోందని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా గ్రీస్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఇంటెలెక్సా సంస్థ అభివృద్ధి చేసిన స్పైవేర్ ప్రిడేటర్‌ను పరిశీలిస్తోందని సమాచారం. ఇది కూడా ఇజ్రాయెల్‌కు చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారే ఈ సంస్థ వెనుక ఉన్నారు. ఆ లెక్కన ఇది కూడా ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ సంస్థగానే చెప్తారు. అయితే, ఈ స్పైవేర్ సంస్థపై ఈ ఏడాది జనవరిలో గ్రీస్ ప్రభుత్వం జరిమానా కూడా విధించింది. మరోవైపు ఈజిప్ట్, సౌదీ, ఒమన్ వంటి దేశాలలోనూ ఈ సాఫ్ట్ వేర్ విమర్శలు ఎదుర్కొంటోంది.

దీంతో ఇండియా క్వాడ్రీమ్, కాగ్నైట్‌ అనే వేరే సాఫ్ట్‌వేర్‌లనూ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా భారత్ ప్రభుత్వం పెగాసస్‌కు ప్రత్యామ్నాయాలను చూస్తోందన్న ఆరోపణలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ, బీజేపీ వర్గాలు మాత్రం భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి ఈ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారంటూ తిప్పికొడుతున్నాయి.