దేనికైనా..ఎప్పుడైనా రెడీ అంటున్న చంద్రబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు అమితానందంలో మునిగిపోయారు. ఆయన నిత్యం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అందరినీ నవ్వుతూ పలుకరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా విరుచుకుపడుతున్నారు. జనంలో మార్పు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేస్తారని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.

టీడీపీ అధినేత దృష్టి అంతా ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ముందస్తుకు భయపడబోమని చంద్రబాబు ప్రకటించారు. ఎవరికీ భయపడబోమని, ముందస్తుకు వెనుకాడబోమని, దేనికైనా తాము సిద్ధమని ఆయన అన్నారు. ఎన్నికలు రేపు వచ్చినా తాము గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

పట్టభద్రుల ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో పర్మినెంట్ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

175 స్థానాల్లో పోటీ చేస్తారా అంటూ ఎవరైనా అడుగుతారా, బుద్ది జ్క్షానం ఉండేవారు ఎవరు అడగరని, ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని భయబ్రాంతులకు గురిచేయడమే వైసీపీ ఎజెండాగా మారిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బానిస బతుకులు బతుకుతున్నారని, వారు కూడా జగన్ నుంచి విముక్తిని కోలుకుంటున్నారని చంద్రబాబు విశ్లేషించారు.

జగన్‌ ఇప్పటివరకు పబ్లిక్ ను ఫూల్స్ చేస్తూ వచ్చారని. ఫైనల్ గా జగన్‌ ను ప్రజలు పెద్ద ఫూల్ ని చేస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఎటుపోతుందో అర్దం కావడం లేదని, రాష్ట్ర అప్పు రూ. 10.31 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో జగన్‌ రూ. 96 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఇది మరింత ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుందని, రాష్ట్రం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వస్తుందని అన్నారు. దేశంలోనే నెంబరు 1 దోపడిదారుడు జగన్ నే నని …. దేశంలో అందరి సీఎంల సంపద కంటే జగన్‌ సంపాదనే ఎక్కువ అని అన్నారు. ఇసుకలో వందల కోట్ల అక్రమాలు చేస్తూ నేను పేదల మనిషిని అంటే సరిపోతుందా అని అన్నారు.