కేటీఆర్ ప‌రువు 100 కోట్లేనా?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ ప‌రువు 100 కోట్లేనా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 100 కోట్లుక‌ట్టి.. కేటీఆర్‌ను ఏమైనా అన‌చ్చా? అని నిల‌దీశారు.  పరువు నష్టం కేసులో కేటీఆర్‌ తనను బెదిరించలేరని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌ పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారని అన్నారు. రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా అని ప్రశ్నించారు.

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే వారు పవిత్రంగా ఉండాలని.. కానీ కమిషన్ దోపీడీదారులకు అడ్డాగా మారిందని రేవంత్ ఆరోపించారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని.. ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేశారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్‌ను కలిసి.. విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు ఎలా వచ్చాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు.

అనంత‌రం.. మీడియాతో మాట్లాడిన రేవంత్‌.. పేప‌ర్ లీకేజీపై ప్రశ్నించిన విద్యార్థి సంఘం నేతలపై కేసులు పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పేపర్ లీకేజ్‌లో అధికారిణి శంకరలక్ష్మి నుంచే నేరం మొదలైందని తెలిపారు. శంకరలక్ష్మిని ఏ-1, ఛైర్మన్‌ను ఏ-2, సెక్రెటరీని ఏ-3గా చేర్చాలని అన్నారు. పెద్దలను కాపాడి చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారని ఆరోపించారు. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్‌ సహా టీఎస్‌పీఎస్సీ అధికారులందరిని ప్రశ్నించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.

ఆ స‌మాచారం ఎక్క‌డిది?

సిట్‌ అధికారులు కోర్టుకు మాత్రమే సమాచారం ఇస్తామన్నారని.. కానీ కేటీఆర్‌కు సిట్‌ వద్ద ఉన్న సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అభ్యర్థుల కటాఫ్‌ మార్కులు ఆయనకు ఎలా తెలిశాయని పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులతో విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. పేపర్‌ లీకేజీలో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.