బాబు అయిపోయారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన కొడాలి నాని

kodali

నిద్ర లేచినంతనే చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడే మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించటం షురూ చేశారు. ఎంత మాట పడితే అంత మాట అనేసే విషయంలో అసలు లెక్క చేయని కొడాలి నాని.. తాజాగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సైతం లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని.. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెప్తున్న వాళ్లు సిగ్గు లేకుండా చంద్రబాబు వెనకాల తిరుగుతున్నారని మండిపడ్డారు.


ఎన్టీఆర్ లా పౌరుషం ఉన్న నాయకుడు హరిక్రిష్ణ మాత్రమే అన్న కొడాలి నాని.. మరి.. హరిక్రిష్ణ సైతం చంద్రబాబును సమర్థించారు కదా? దానికేమంటారు కొడాలి నాని? అని ప్రశ్నిస్తున్నారు. అన్నింటికి మించి చంద్రబాబునువెన్నుపోటు పొడినట్లుగా ఇప్పుడు నానా మాటలు అంటున్న ఆయన.. మరి చంద్రబాబు నాయకత్వంలోనే ఎన్నికల్లో టికెట్లు ఎందుకు తెచ్చుకున్నట్లు? ఆయన నాయకత్వంలో ఎందుకు పని చేసినట్లు? అన్నది ప్రశ్న.


ఇప్పుడు నీతులు చెబుతున్న కొడాలి నాని.. గతంలో చంద్రబాబు నాయకత్వంలోని పార్టీలోనే ప్రయానించిన విషయాన్ని ప్రజలు మర్చిపోయే అవకాశమే లేదు. ఒకవేళ చంద్రబాబు తప్పే చేసి ఉంటే.. ఆ తప్పులో కొడాలి నాని తప్పు కూడా ఉంది కదా? నిత్యం ఎన్టీఆర్ ను కీర్తించే కొడాలి.. తాను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అడుగులకు కొంతకాలం పాటు మడుగులు ఒత్తారుకదా? దానికి ఆయనేం సమాధానం చెబుతారు? ఆ తప్పునకు ఆయనకు ఆయన వేసుకున్న శిక్ష ఏమిటి? అన్న ప్రశ్నలు పలువురు సంధిస్తున్నారు.


చంద్రబాబు హయాంలో పోలవరం ఎందుకు పూర్తి చేయలేదన్న కొడాలి ప్రశ్నకు.. మరి జగన్ నాలుగేళ్ల పాలనలో ఏం చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా? చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టులో జరిగిన పనులు ఎంత? జగన్ నాలుగేళ్ల కాలంలో జరిగిప పనులు ఎంత? అన్న విషయం మీద కొడాలి వివరాలతో ఒక వివరణ విడుదల చేయొచ్చు కదా? అన్న ప్రశ్నలుపలువురు అడుగుతున్నారు.


ఏదో విధంగా చంద్రబాబును నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టాలన్న కసి తప్పించి.. ఇంకేమీ లేదన్నట్లుగా కొడాలి నాని తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన సంధించే ప్రతి ప్రశ్న.. ఆయన్నే వేలెత్తి చూపించేలా ఉండటం దేనికి నిదర్శనం? దానికి ఆయనేం సమాధానం చెబుతారు? అన్నది ప్రశ్న. వీటికి కొడాలి నాని బదులిస్తారంటారా?