అవినాశ్ రెడ్డి.. నెల రోజుల గడువు పెట్టిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ఊహించని రీతిలో ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణ ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి భవిష్యత్తు ఏంటనేది ఈ గడువుతో తేలనుంది. అయితే… సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వగా సీబీఐ అంతకంటే రెండు వారాల ముందు .. అంటే, ఏప్రిల్ 15కే పూర్తి చేస్తామని కోర్టుకు చెప్పింది.

నిజానికి అవినాశ్ చుట్టూ ఈ కేసు బిగుసుకోవడంతో, ఆయన ప్రియమైన సోదరుడు, ఏపీ సీఎం జగన్ తన తమ్ముడు అవినాశ్‌ను ఎలాగైనా బయటపడేయాలన్న లక్ష్యంతో దిల్లీ పర్యటనలు చేస్తున్నారు. దిల్లీలో కేంద్రంలోని పెద్దలను కలిసి సీబీఐని కాస్త చూసీచూడనట్లు వెళ్లమని చెప్పాలని ప్రాథేయపడుతున్నారు. జగన్ తాజా పర్యటన కూడా రాష్ట్రం కోసం కాదని, రాజకీయం కోసం అంతకన్నా కాదని.. కేవలం తన తమ్ముడు అవినాశ్‌ను కాపాడుకోవడం కోసమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఆగ్రహించడంతో పాటు అవసరమైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరును మార్చాలని సూచించడంతో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్ సింగ్‌ను సీబీఐ ఈ కేసు నుంచి తప్పించింది. ప్రత్యేక విచారణ బృందాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. ఇలా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌కు కేఆర్ చౌరాసియా నాయకత్వం వహించనున్నారు.

వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మార్చి 15న హత్యకు గురయ్యారు. తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు నాలుగేళ్లలో ఎన్నో మలుపులు తిరిగింది. కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకూ వెళ్లింది. నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అఫ్రూవర్‌గా మారడం వంటివి జరిగాయి. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రిని కూడా ఈ కేసులో సీబీఐ విచారిస్తోంది. తొలుత 2023 జనవరి 28న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు.

ఆ తరువాత కూడా అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణకు పిలుస్తూనే ఉంది.తన మీద సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హై కోర్టుకు కూడా వెళ్లారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ అన్ని ఆధారాలు సంపాదించిందని.. ఆయన అరెస్టు తప్పదని ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.