సోమిరెడ్డి టెన్షన్

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు. టీడీపీలో కొందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని విశ్వసిస్తున్న నేతలే తమ పరిస్థితేమిటోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. కొన్ని జిల్లాలో ఈ పరిస్థితి నాయకుల్లో భయానికి కూడా కారణమవుతోంది.

సింహపురి మొత్తం టీడీపీ పరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.. ఇప్పుడు వైసీపీకి దూరం జరుగుతున్న ఆనం రామానారాయణ రెడ్డి, కోటంరెడ్డి రేపో మాపో పసుపు కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు. పైగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా జై చంద్రబాబు అంటారని వార్తలు వస్తున్నాయి. దానితో పార్టీ గెలిచిన తర్వాత జిల్లాల వారీగా మంత్రి పదవుల పందేరానికి సమస్యలు ఏర్పడతాయని ఇప్పటి నుంచే టాక్ మొదలైంది.

నెల్లూరు జిల్లాలో ఎక్కువ భయపడుతోందీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డేనని చెబుతున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చాలా రోజులైంది. అయినా సరే పార్టీ అధికారంలో ఉంటే మాత్రం సోమిరెడ్డి మంత్రిగా ఉంటారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఇబ్బంది లేకుండా చంద్రబాబు చూసుకుంటారు. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి లేదని అంటున్నారు.

ఆనం, మేకపాటి, కోటంరెడ్డి కుటుంబాలు తెలుగుదేశంలోకి వచ్చేస్తే మంత్రి పదవుల టెన్షన్ మొదలవుతుంది. ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులకు మించి ఇవ్వలేని పరిస్తితి ఉంటుంది. అందులో ఒకటైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. దానితో ఆ మూడు పెద్దారెడ్డి కుటుంబాల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తే తనకు మొండిచెయ్యేనని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారట. దానితో ఇప్పుడేం చేయాలి, వారిని ఎలా నిలువరించాలని తెలిసిన వారిందరి సలహాలు అడుగుతున్నారట. మరి సోమిరెడ్డి ఏం చేస్తారో చూడాలి.