కటౌట్ కు కాపలాగా పోలీసులు

ప్రజాజీవితంలో ఉండి.. తమ జీవితాన్ని ప్రజల కోసం ధారపోసే నేతల వైభోగం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని చెప్పేందుకు తాజా ఉదంతానికి మించిన ఉదాహరణ మరేదీ ఉండదని చెప్పాలి. గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్.. తన తీరుతో తరచూ వార్తల్లో నిలిచేవారు. ఆ మధ్యన జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవిని పోగొట్టుకున్నఆయన.. ప్రస్తుతం మాజీ మంత్రిగా.. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

రెండురోజుల క్రితం ఆయన పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడితో ఆగితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. ఆయన చేసిన చేష్ట ఇప్పుడు అందరి నోట నానుతోంది. నెల్లూరు నర్తకి సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్ఱహానికి అడ్డుగా భారీగా ఉన్న అనిల్ కుమార్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్గుగా ఉన్న కటౌట్ ను ఏర్పాటు చేయటంపై టీడీపీ నగర ఇన్ చార్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కటౌట్ ను తొలగించాలని కోరారు.

అయితే.. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు.. తాజాగా టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నర్తకి సెంటర్ కు వచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఆయన అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిగారి నిలువెత్తు కటౌట్ ను తొలగిస్తారన్న సందేహానికి గురైన పోలీసులు.. భారీగా మొహరించారు.

నగరంలో కటౌట్లు.. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని.. నిషేధం ఉందని చెప్పే అధికారులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు కటౌట్ ను చూస్తూ ఎలా ఉన్నారన్న ప్రశ్నలు ఎక్కువ అయ్యాయి. అంతేకాదు.. మాజీ మంత్రి అనిల్ కటౌట్ ను టీడీపీ వారు తొలగిస్తారేమోనన్న సందేహంతో ఒక సీఐతో సహా మొత్తం 15 మంది పోలీసుల్ని కటౌట్ కు భద్రత కల్పించేందుకు కేటాయించటం విస్మయానికి గురి చేస్తోంది. ఒక నేతకు భద్రత పెంచటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా ఒక కటౌట్ కు 15 మంది పోలీసు సిబ్బందిని కేటాయించిన వైనం షాకింగ్ గా మారింది.