వైసీపీ ఆహ్వానంపై జేడీ లక్ష్మీనారాయణ ఆన్సర్!

తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒకరు. నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఆయన పేరు అప్పట్లో మారుమోగింది. తర్వాతి కాలంలో ఐపీఎస్ పదవిని వదిలేసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం.. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవటం తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆసక్తికర ప్రశ్నలు ఎదురైతే.. అందుకు ఏ మాత్రం తడబడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఇచ్చిన ఆన్సర్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది.. ఆయన్ను పార్టీలో చేరాలని అధికార వైపీపీ నుంచి ఆహ్వానం రావటం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అప్పట్లో జగన్ ను విచారించటం తెలిసిందే. తిరుగులేని హవా నడిపిస్తున్న గాలి జనార్దన్ రెడ్డిని అనూహ్య రీతిలో అరెస్టు చేసి తరలించిన ఎపిసోడ్ లోనూ జేడీ లక్ష్మీనారాయణ కీలకంగా వ్యవహరించటం తెలిసిందే.

ఏ పార్టీ అధినేతను అవినీతి ఆరోపణల మీద విచారణ చేపట్టారో.. అదే అధికారి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత.. తమ పార్టీలో చేరాలన్న ఆహ్వానం ఆయనకు వచ్చిందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘వాళ్లు అడుగుతుంటారు. అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఏముంది సార్.. రండి పార్టీలోకి అంటుంటారు. 2019లో కూడా రమ్మన్నారు. నేను వెళ్లలేదు’ అని బదులిచ్చారు.

ఈ మధ్యన బీఆర్ఎస్ లోకి చేరనున్నట్లుగా ప్రచారం జరిగింది కదా? అన్న ప్రశ్నకు లక్ష్మీనారాయణ బదులిస్తూ.. ‘నాయకులు నన్ను కలిసి అడుగుతుంటారు. వాళ్లు పార్టీలో చేరాలని అడగటం మాత్రం నిజం. నేను, తోట చంద్రశేఖర్ ఒకే కేడర్ మిత్రులం. మహారాష్ట్రలో కలిసే పని చేశాం. ఇద్దరం జనసేనలో ఉన్నాం. ఇప్పుడుఆయన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు. అందుకే వచ్చేయొచ్చు కదా అని అడుగుంటారు. మాట్లాడింది అయితే నిజం. ఆలోచిస్తున్నట్లు చెప్పా’ అని పేర్కొన్నారు.

మరి మీరు ఒకప్పుడు అరెస్టు చేసి.. జైలుకు పంపిన వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అని ప్రశ్నించగా.. ‘ఇలాంటివి కొంత ప్రభావం చూపిస్తుంటాయి. ఈ విషయాన్నీ చేశారా? లేదా? అన్నది కోర్టులో తేలిపోతే బాగుంటుంది. ఇలాంటి వాటి విచారణ విషయంలో వేగం కావాలి. కొత్త కోర్టులు.. రోజువారీ విచారణ లాంటివి చేస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు.