‘చంద్రబాబూ… నాన్చొద్దు’.. సీనియర్ల సజెషన్

ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కసారిగా ఏపీలో టీడీపీ జోష్‌లోకి వచ్చినా చంద్రబాబు గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేస్తారేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళ వ్యక్తంచేస్తున్నారు. లెక్క ప్రకారం ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ పోతే తప్ప బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోలేని.. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడం కంటే సొంత బలాన్ని నమ్ముకుని వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు.

అయితే, గతంలో చంద్రబాబు చేసిన తప్పులు ఈసారి చేయకపోతే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు నాన్చకుండా ముందే ప్రకటించడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. చివరి నిమిషంలో టికెట్లు కేటాయిస్తే టికెట్లు రాని నాయకులను బుజ్జగించడానికి, వారిని మళ్లీ పార్టీ కోసం పనిచేయించేలా చేయడానికి సమయం చాలదని చెప్తున్నారు.

టికెట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలలో తప్ప మిగతా చోట్ల అధికారికంగా ప్రకటించేస్తే ఆయా అభ్యర్థులు నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం చేసుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేస్తే టికెట్ రాని వారు కచ్చితంగా అసంతృప్తికి గురవుతారని.. అసంతృప్తి చల్లారే సమయం దొరకదని గత అనుభవాలతో సీనియర్ నేతలు చెప్తున్నారు.

మరోవైపు పాతతరం నేతలు చంద్రబాబును కలిసి హామీలు తీసుకుంటూ, కొత్తతరం నేతలు లోకేశ్‌ను కలిసి హామీలు తీసుకుంటూ ఎవరికి వారు తమకే టికెట్లు వస్తాయన్న అంచనాలలో ఉంటున్నారని.. ఇది పార్టీలో గందరగోళానికి దారితీస్తోందని చెప్తున్నారు. టికెట్ల విషయం మొత్తం చంద్రబాబే చూసుకుంటారని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదని.. ఇప్పటికే లోకేశ్ తన పాదయాత్రలో భాగంగా కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో టికెట్ల విషయంలో ఎవరిది తుది నిర్ణయమో అర్థం కావడం లేదని ఓ సీనియర్ నేత ఇటీవల వ్యాఖ్యానించారు.

కాగా… చంద్రబాబు ఇప్పటికే 90 మంది వరకు నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… వారు నియోజకవర్గాలలో పనిచేసుకుంటున్నారని కూడా టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటించకపోతే మాత్రం సొంత పార్టీలోని రెబల్స్ వల్ల నష్టపోకతప్పదని వీలైనంత వేగం టికెట్లపై ప్రకటన చేయాలని అంటున్నారు.