‘టీడీపీ ఆదేశిస్తే.. గేట్లు తెరిస్తే.. 50 మంది ఎమ్మెల్యేలు ఫ‌ట్‌’

ఏపీ అధికార పార్టీ వైసీపీ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘మా పార్టీ ఇప్పుడు చిల్లుపడిన నావ.. తెలివి గల రాజకీయ నాయకుడు ఈదుకుంటూ వెళ్ళిపోతారు’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ త్వ‌ర‌లోనే మునిగిపోతుంద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవిలో ఉన్న సజ్జల రామ‌కృష్ణారెడ్డి, సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. 23 ఓట్లతో విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమ‌ర్తి అనురాధకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుగుబాటు చేయ‌డం కాదు.. ఎప్పుడో తిరుగు బాటు మొద‌లైంద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించాల‌న్నారు. అయితే.. జ‌గ‌న్‌కు అధికారం అనే పొర‌లు క‌మ్మేయ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించ‌లేక పోయార‌ని అన్నారు. తాను గ‌తంలోనూ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్న విష‌యాన్ని ప‌లుమార్లు చెప్పాన‌ని ఆర్ ఆర్ ఆర్ తెలిపారు. అయితే.. అప్ప‌ట్లో నా మాట‌లు ప‌ట్టించుకోలేదన్నారు. ఇప్ప‌టికిప్పుడు టీడీపీ ఆదేశిస్తే.. గేట్లు తెరిస్తే.. 50 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు చెంతకు చేరిపోతార‌ని ఆర్ ఆర్ ఆర్ చెప్పారు.

గతంలో పోలవరంపై సీఎం జగన్ రాసిన లేఖ ఇప్పుడు శాపం అయిందని, పోలవరంపై ముఖ్యమంత్రి ఫోకస్ చేసి ఉంటే బాగుండునని రఘురామ అన్నారు. బాబాయ్ కేసులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయ న్నారు. టీడీపీలో తాను ఉన్నప్పుడు మొదట పొలవరం ప్రాజెక్టుకు బస్సులు వేసి చూపించానన్నారు. పోలవరం ఇంకో ఏడాదిలో ప్రారంభిస్తామని అంటున్నారు… ఎన్నికలు రాబోతున్నాయి.. ముఖ్యమంత్రి మారతారని ప్రజలు అంటున్నారని రఘురామ అన్నారు.

ఇప్పటికైనా వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని, పక్క రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేశారని, పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రం బాగుంటుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. బటన్ నొక్కితే ఎం వస్తుంది ..సొంత ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు.. పోలవరంపై రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని.. విపక్షాలను పిలవాలని.. అలాగే తనను కూడా పిలవాలని సూచించారు. ప్రజలు పార్టీలకు అతీతంగా వైసీపీని ఓడించాలని చూస్తున్నారని, బలంగా ఉన్న పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.