ఇప్పుడదో టెన్షన్ సేన

ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్ల గెలవడం, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయం సాధించడంతో టీడీపీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడం నాటి మాటేనని, ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రైజింగ్ స్టార్స్ గా ఉన్న టీడీపీ నేతల్లో ఇప్పుడో ధీమా కూడా కనిపిస్తోంది. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా విజయం తమదేనని తెలుగు తమ్ముళ్లు ధైర్యంగా చెబుతున్నారు..

ఇంతకాలం టీడీపీ ఎన్నికల వ్యూహాలు వేరుగా ఉండేవి. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమై చాలా రోజులైంది. చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవడంతో పొత్తు ఖరారైనట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. నలభై సీట్ల వరకు జనసేనకు వదిలే అవకాశం ఉందని కూడా చెప్పుకున్నారు. అయితే 20 సీట్లు ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. పార్టీ 10వ ఆవిర్భావ సభలో దానికి పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు. వాట్సాప్ మెసేజులను నమ్మొద్దని సరైన సమయంలో స్పందిస్తామని ఆయన చెప్పుకున్నారు..

రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ పెరిగిపోవడంతో జనసేనకు టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. ఒంటరి పోరుకు దిగి గత ఎన్నికల్లో మాదిరాగా ఘోర పరాజయం మూటగట్టుకునేకంటే పొత్తుగా పోటీ చేసి కొన్ని సీట్లయినా సాధిస్తే బావుంటుందని జనసేన భావిస్తోంది. తనతో సహా పోటీ చేసిన వాళ్లంతా అసెంబ్లీకి వెళ్లాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు విపరీతమైన ఫార్మ్ లో ఉన్న టీడీపీ తీరు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. నిన్నటి వరకు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరని అంగీకరిస్తున్నాయి.

గత ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరిపోయారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. దానితో జనసేనకు ఇప్పుడు డిమాండ్ చేసే సత్తా లేకుపోయింది. పైగా పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. టీడీపీకి పరోక్షంగా మద్దతిచ్చి గెలిపించింది. ఇప్పుడు లెక్కలు చెప్పుకునేందుకు జనసేన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి…

ఇకపై టీడీపీ తీరు ఎలా ఉంటుందోనని జనసేన వర్గాల్లో టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. టీడీపీకి విపరీతమైన ప్రజాదరణ రావడం, ప్రజల నాడిని అర్థం చేసుకుని ఎమ్మెల్యేలు కూడా అనురాధను గెలిపించడంతో జనసేన పునరాలోచనలో పడింది. టీడీపీ వద్ద డిమాండ్ల్ పెట్టే స్థాయిలో తాము లేమని జనసేన వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదని కొందరు జనసేన నేతలు అంటుంటే, సూత్రప్రాయంగా పొత్తుకు అంగీకరించిన కారణంగా చంద్రబాబు తమకు మునుపటి గౌరవమే ఇస్తారని మరికొందరు లెక్కలేస్తున్నారు. రెండు పార్టీల ప్రయోజనంతో పాటు విశాల జనహితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరికీ ఆమోదయోగ్యమైన సర్దుబాటుకే చంద్రబాబు మొగ్గు చూపుతారని జనసేన వర్గాలు ధీమాగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.