కేంద్ర కార్యాలయానికి దారేదీ…

బెల్లం చుట్టూ ఈగెలు ముసురుతాయంటారు. అధికారం ఉన్న చోటే రాజకీయ నాయకులు ఉంటారంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతున్నా కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారం లేని చోట ఉండేందుకు రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు…

జగన్ నాలుగేళ్ల పాలనలో అరాచకాలు, అవకతవకలకు విసిగిపోయి జనం వైసీపీకి దూరమవుతున్నారు. ఓటర్లు క్రమంగా మళ్లీ టీడీపీ వైపుకు జరుగుతున్నారు. జననాడిని కొంతమంది టీడీపీ నేతలు పట్టేసినట్లున్నారు. అంతే మొహంలో తెగ నవ్వు పులుముకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అంటీ ముట్టనట్లు ఉంటున్న నేతలు ఇప్పుడు పెద్దల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న , మొన్నటి వరకూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడనివారు ఇప్పుడు పసుపు చొక్కా వేసుకొని మరీ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నేతలు…. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులు గెలవడంతో పసుపు చొక్కాను మళ్లీ వేసుకుంటున్నారు. అధికారం ఉండగా అనుభవించి, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు రాత్రి వెళ్లిపోయిన వారు మళ్లీ ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు. వీళ్లను చూసి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

అవసరం కొద్దీ, అవకాశం కోసం తిరిగి వస్తున్న నేతలను చూసి మొదటి నుంచి విధేయతగా ఉంటున్న వారు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. అటువంటి వాళ్లను దగ్గరకు రానిస్తే కేసులు, లాఠీ దెబ్బలు , అవమానాలు ఎదుర్కొన్న తమ పరిస్థితి ఏంటని ఈ నాలుగు సంవత్సరాలు పార్టీని అంటిపెట్టుకున్న నేతలు ప్రశ్నిస్తున్నారు.

కేసులు, అరెస్టులకు భయపడి పారిపోయిన వాళ్లు, ఇప్పుడు అధికారం వస్తుందనుకునే సరికి మళ్లీ పరుగు పరుగున వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీని ఎదుర్కొని నిలబడిన హీరోలు కావాలా, అవకాశవాదులు కావాలా టీడీపీలో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే ఇంతవరకు కేంద్ర కార్యాలయం మొహం చూడని వాళ్లు, పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ గెలిచే సరికి కేంద్ర కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఉద్యమాలు, ధర్నాల్లో పాల్గొనాలంటూ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లినప్పుడు పట్టించుకోని వాళ్లు ఇప్పుడు మాత్రం అందరినీ తోసేసి ముందు నిల్చోవాలనుకుంటున్నారు.

చంద్రబాబు, లోకేష్‌ ఇటువంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ కేంద్ర కార్యాలయంలోని కీలక నేతలే హెచ్చరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా కష్టాలు అనుభవించారని, ఇప్పుడు వచ్చేవారికి పెద్ద పీట వేస్తే కష్టకాలంలో అండగా ఉన్నవారి త్యాగాలను విస్మరించినట్టేనని సాక్ష్యాత్తు పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు నిర్మోహమాటంగా చెబుతానని కూడా ఆయన బహిరంగంగానే ప్రకటించారు.