ఇద్దరూ లూజర్లే.. మరి కూటమిని ఎలా గెలిపిస్తారో?

నిజమే… ఇప్పుడు బీజేపీ, జనసేన కూటమికి సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చకు తెర లేసిందనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అంతేనా.. 2024లో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీకి కూడా ప్రత్యామ్నాయంగా తమ కూటమే నిలుస్తుందని, తమ కూటమే విజయం సాధించి తీరుతుందని బీజేపీ ఏపీ శాఖ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు ఘనంగానే ప్రకటించేశారు. అయితే సొంతంగా ఏ ఎన్నికల్లోనూ గెలవని ఈ ఇద్దరు నేతల ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించేదెలా? అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

అటు పవన్ ను తీసుకున్నా, ఇటు సోమును తీసుకున్నా.. వీరి ట్రాక్ రికార్డులో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క గెలుపు కూడా లేదు. పవన్ 2019 ఎన్నికల్లో మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటిదాకా టాలీవుడ్ లో పవర్ స్టార్ గా భారీ అభిమానగణమున్న పవన్… రాజకీయాల్లోనూ సత్తా చాటుతానని భావించారు.

రాష్ట్రంలోని ఏ జిల్లా, ఏ స్థానం అయినా ఫరవా లేదని, తన గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. అయితే ఎన్నికలు సమీపించేసరికి గెలుపుపై ధీమా లేకనో, ఏమో తెలియదు గానీ.. తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాకలోనూ బరిలోకి దిగారు. అయితే ఊహించని విధంగా ఈ రెండు చోట్ల కూడా పవన్ ఓటమిపాలయ్యారు.

ఇక సోము వీర్రాజు పరిస్థితి కూడా పవన్ పరిస్థితికి ఏమాత్రం భిన్నంగా లేదనే చెప్పాలి. సుధీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్న సోము వీర్రాజు… ఇప్పటిదాకా ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ విజయం సాధించిన దాఖలా లేదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు… పలుమార్లు ఎమ్మెల్యే స్థానానికి, ఓ సారి ఎంపీ స్థానానికి పోటీకి దిగారు. అయితే ఏ ఎన్నికలోనూ ఆయన విజయం సాధించలేదు.

అయితే టీడీపీ అధికారంలో ఉండగా.. నామినేటెడ్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. పవన్ మాదిరిగా కాకుండా చట్టసభలో అడుగుపెట్టినప్పటికీ, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన సత్తా వీర్రాజుకు లేదనే చెప్పాలి.

ఇప్పుడు అనుకోని విధంగా జనసేనకు పవన్ చీఫ్ గా ఉండగా, బీజేపీ ఏపీ శాఖకు వీర్రాజు అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా ఈ రెండు పార్టీల మధ్య ఇటీవలే పొత్తు కూడా పొడిచింది. ఈ కూటమి లక్ష్యం 2024లో ఏపీలో అధికారం చేపట్టడమేనట. ఇదే మాటను బీజేపీ ఏపీ చీఫ్ గా ఎంపికైన తర్వాత వీర్రాజు ఒకింత ఘనంగానే ప్రకటించారు.

ఇక పవన్ కూడా గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా… 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగుతున్నట్లుగా ప్రకటించారు. తమను తాము ఎన్నికల్లో గెలిపించుకోలేని ఈ ఇద్దరు నేతల ఆధ్వర్యంలోని ఈ రెండు పార్టీల ెకూటమిని వీరిద్దరూ ఎలా విజయ తీరాలకు చేరుస్తారో చూడాల్సిందే.