బీజేపీకి కలిసొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను గద్దె దించుతామని, ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజుకో అవినీతి ఆరోపణ చేస్తూ కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత  పేరు రావడం కూడా బీజేపీ క్యాంపైన్ కు బాగానే ఉపయోగపడుతోంది. సరిగ్గా ఇదే టైమ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి..

ఏవీఎన్ రెడ్డి విజయం

ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి అనుకూల ఫలితాలనిచ్చాయి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బహిరంగ మద్దతు పలికిన  ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.  మహబూబ్ నగర్ – రంగారెడ్డి –  హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి కంఫర్టబుల్ గా గెలిచారు.

నిజానికి ఏవీఎన్ రెడ్డి కోసం బండి సంజయ్ ప్రచారం కూడా చేశారు. పాలమూరు  జేజెమ్మగా పిలిచే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. గతంలో ఎన్నడూ గెలవని  ఏవీఎన్ రెడ్డిని  గెలిపించి చూపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే టీచర్లకు ఒకటో తేదీని జీతాలు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు. బదిలీల ప్రక్రియలో ఎదురైన ఇబ్బందులను తొలగిస్తామన్నారు. పెండింగ్ బిల్లులను నెలరోజుల్లో చెల్లిస్తామన్నారు. బండి సంజయ్ చేసిన ప్రకటనలు టీచర్లపై బాగానే ప్రభావం చూపి ఏవీఎన్  రెడ్డి విజయానికి దోహదం చేశాయని చెప్పాలి.

పోటీకి దూరం.. ఐనా..

బీఆర్ఎస్ ఈ సారి పోటీ చేయలేదు. ఎవరికీ బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఐనా.. బీజేపీ మద్దతు ప్రకటించిన  అభ్యర్థి  గెలవడం మాత్రం అధికార  పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ప్రభుత్వం  పట్ల టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేందుకు ఈ ఫలితం ఓ నిదర్శనమని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. బీఆర్ఎస్ కు మద్దతిస్తే నష్టపోతామని టీచర్లు గుర్తించారని, అందుకే ఏవీఎన్ రెడ్డికి ఓటేశారని  బండి సంజయ్ అంటున్నారు. పైగా టీచర్ ఎమ్మెల్సీ  ఎన్నికలపై జేపీ నడ్డా కూడా ప్రత్యేకంగా ఆరా తీశారు. ఇదే ఒరవడిని అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని సంజయ్ కూ సూచించారు..