రేపేం జరుగుతుంది ?

మాగుంట కుటుంబం… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. వ్యాపారాల్లో రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబం అది. పదిమందికి సాయం చేసే కుటుంబం అన్న పేరు కూడా ఉంది. ఇప్పుడా కుటుంబం కష్టాల్లో ఉంది.. అవి ఆర్థిక కష్టాలు కాదు.. ధనరాశులకు కొదవలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కారణంగా మాగుంట కుటుంబంపై మాయని మచ్చ పడే ప్రమాదం ఏర్పడింది.

దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆయన సతీమణి పార్వతమ్మ, ప్రస్తుత ఎంపీ శ్రీనివాసులు రెడ్డి అందరికీ పరిచయం ఉన్నవారే. అవకాశాన్ని, అవసరాన్ని బట్టి పార్టీలు మారుతూ రాజకీయాల్లో నిలదొక్కుకున్న వారే. ఎంపీ శ్రీనివాసులు రెడ్డి 2024 ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడు రాఘవరెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనుకున్నారు. వైసీపీ లేదా టీడీపీ ఏదోక పార్టీలో తనయుడిని ఎంపీగా చూడాలనుకున్నారు. అంతలో కేసు వచ్చి పడింది. రాఘవరెడ్డి అరెస్టయ్యారు.

మాగుంట కుటుంబానిది మొదటి నుంచి మద్యం వ్యాపారం. దక్షిణాది రాష్ట్రాల్లో హోల్ సేల్ గా మద్యం అమ్మేవారు. 2019 ప్రాంతంలో ఏపీలో కొంత వత్తిడి ఎదురైంది. రావాల్సిన డబ్బులు రావడం లేదని గ్రహించి.. రూటు మార్చాలనుకున్నారు. అప్పుడే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందని కొందరు సూచించారు. రిటైల్ గానే వ్యాపారం చేస్తూ హోల్ సేల్ వ్యాపారంలో వచ్చినంత లాభాలు పొందే వీలుంటుందని చెప్పారు. భాగస్వామ్య వ్యాపారానికి ఆహ్వానించిన వారు పెద్దమనుషులు కావడంతో మాగుంట కాదనలేకపోయారు. అన్ని పనులను అనుభవం లేని తన కుమారుడు రాఘవరెడ్డికి అప్పగించారు. అదే పెద్ద పొరపాటైంది. చివరకు అది స్కాంగా మారి కూర్చుంది. ఇప్పుడు తప్పించుకోలేని పరిస్తితి తెచ్చిపెట్టింది.

శ్రీనివాసుల రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. శనివారం హాజరు కావాలని ఆదేశించింది. ఇదే స్కాంలో కవిత హాజరు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. గురువారం ఆమె హాజరు కాకపోవడంతో సోమవారం రావాలని ఈడీ నోటీసులు పంపింది. ఆ రోజు కూడా హాజరుకాకుండా ఉండేందుకు ఆమె కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లేదా వేరే పద్ధతిలో విచారణ జరపాలని కవిత అంటున్నారు. నిజానికి కవిత, మాగుంట, సిసోడియా సహా స్కాంలో భాగస్వాములుగా భావిస్తున్న ఇతరులను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించాలని ఈడీ భావించింది. అందుకు కవిత సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. ఆమెను అరెస్టు చేస్తారా లేదా ఇంకా స్పష్టత రాలేదు.

కవిత వ్యవహారంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో మాగుంట వైపు నుంచి నరుక్కుని వచ్చేందుకు ఈడీ ప్రయత్నించే వీలుంది. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని చెబుతూ ఆయన్ను అరెస్టు చేసే అపకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే రాజకీయంగా కూడా మాగుంటకు దెబ్బేనని భావించాల్సి ఉంటుంది. మరి శనివారం ఏం జరుగుతుందో చూడాలి…