న‌డ్డా పోస్టు త‌ర్వాత‌.. ఏపీలో మార్పు ఇదే!!

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. సోష‌ల్ మీడియాలో రెండురోజుల కిందట పెట్టిన ఒక పోస్టు.. ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న ఉద్దేశం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పోస్టులో ఉన్న సందేశం.. ఆయ‌న చేసిన కామెంట్లు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇది భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌కు సంకేతమా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. ఏపీ బీజేపీ నాయ‌కులు మాత్రం దీనిపై పెద‌వి విప్ప‌డం లేదు.

ఇంత‌కీ న‌డ్డా పోస్టు ఏంటంటే.. ఎక్క‌డో దేశం నుంచి విసేరిసిన‌ట్టు ఉండే.. అండ‌మాన్‌-పోర్టుబ్లెయిర్ దీవుల్లో ఒక మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఉంది. వాస్త‌వానికి ఇవ‌న్నీ..కేంద్ర పాలిత ప్రాంతాలు. అయిన‌ప్ప‌టికీ.. స్థానికంగా పాల‌న జ‌రుగుతోంది. గ‌త మూడేళ్ల కింద‌ట పోర్ట్‌బ్లెయిర్ మునిసిపాలిటీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. అంటే.. ఇది జ‌రిగింది 2019 త‌ర్వాతే. సుమారు 2020 ప్ర‌థ‌మ‌, ద్వితీయార్థంలోనే.

ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా పోటీ చేసి.. మొత్తం 18 స్థానాలున్న మునిసిప‌ల్ కార్ప‌రేష‌న్ వార్డుల్లో రెండు స్థానాల‌ను(వార్డులు) టీడీపీ ద‌క్కించుకుంది. ఇదేస‌మ‌యంలో బీజేపీ 6 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. అయినా.. అధికారంలోకి రావాలంటే.. నాలుగు సీట్లు అవ‌స‌రం. ఈ క్ర‌మంలో బీజేపీకి.. టీడీపీ మ‌ద్ద‌తిచ్చింది. దీంతో బీజేపీ మునిసిప‌ల్ ప‌గ్గాలు చేప‌ట్టింది. ఇక‌, పొత్తుల క్ర‌మంలో జ‌రిగిన ఒప్పందం మేర‌కు చివ‌రి రెండు సంవ‌త్స‌రాల స్థానిక పాల‌న ప‌గ్గాలు టీడీపీకి ద‌క్కాయి.

ఈ క్ర‌మంలో పోర్ట్‌బ్లెయిర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గిరీ టీడీపీకి ద‌క్కింది. దీనినే న‌డ్డా ట్వీట్ చేశారు. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్య‌ర్థి చైర్మ‌న్ ప‌ద‌విని చేప‌డుతున్నార‌ని పేర్కొంటూ.. ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే.. ఈ ట్విట్ ఏపీ రాజ‌కీయాల్లో కాక రేపింది. ఏపీలో కొన్నాళ్లుగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. బీజేపీ నుంచి ఎలాంటి స్పంద‌నా రావ‌డం లేదు.

ఇప్పుడు పోర్టుబ్లెయిర్ విష‌యాన్ని న‌డ్డానే వెలుగులోకి తెచ్చిన క్ర‌మంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కు ఆయ‌న మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం అయితే.. దీనిపై బీజేపీ రాష్ట్ర నేత‌ల‌ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ, టీడీపీ మాత్రం న‌డ్డా పోస్టును జోరుగా వైర‌ల్ చేసి.. ప్ర‌జ‌ల‌కు ఒక సందేశం పంపిస్తున్న‌ట్టుగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి దీనిని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.