ఏపీకి అప్పులు ఇవ్వొద్దు.. ఇచ్చినా జాగ్ర‌త్త‌: కాగ్ హెచ్చ‌రిక‌లు

ఏపీ ప‌రువు మంట‌గ‌లిసిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికీ.. ప‌ట్ట‌ని దుస్థితి ప‌ట్టింది. ఏపీకి అప్పులు ఇవ్వొద్ద‌ని.. ఇచ్చినా.. ఇవ్వాల‌ని అనుకున్నా..ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లాల‌ని.. ఆ త‌ర్వాత మీ కొంప‌లే మునిగిపోయినా.. ఎవ‌రూ కాపాడ‌లేర‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌) తాజాగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. 2021 మార్చి నెల చివరి వరకు ఏపీ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది.

అంటే, 2019-21 మ‌ధ్య రెండేళ్ల నాటి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వు బ్యాంకు కూడా అనేక అంశాలను తప్పుబట్టింది. ఏపీకి అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివిధ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. రుణాలను భరించే సామర్థ్యం ఏపీకి లేదని.. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారని కాగ్‌ ఆక్షేపించింది.

తీసుకున్న రుణాలను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని.. రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించిం ది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయిలు జీఎస్డీపీలో 35 శాతానికి మించకూడదని ఎఫ్ఆర్బీఎమ్ చట్టం చెబుతున్నా.. ఏపీ అప్పులు మాత్రం 35.30శాతం ఉన్నాయని తేల్చింది.

బడ్జెట్‌లో చూపించకుండా బయటి నుంచి తీసుకునే రుణాలనూ పరిగణిస్తే ఇది 44.04 శాతం అవుతుందని స్పష్టం చేసింది. 2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడు సంవత్సరాలలో 45.74 శాతం అంటే.. లక్షా 23వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని స్పష్టం చేసింది. దీనికి సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయని రాష్ట్రాన్ని కాగ్‌ హెచ్చరించింది.

ప్రతి సంవత్సరం రాష్ట్ర అప్పులు పెరుగుతూనే ఉన్నాయని కాగ్ హెచ్చ‌రించింది. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని విశ్లేషించింది. తీసుకున్న రుణాల్లో 81శాతం రెవెన్యూ ఖర్చులకే వాడుతోంద‌ని, దీంతో ఆదాయం కొర‌వ‌డుతోంద‌ని హెచ్చ‌రించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు వ్య‌వ‌హ‌రించాల‌ని తేల్చి చెప్పింది.