మా నాన్న హ‌త్య‌ను.. ‘కామ‌న్’ అన్నారు: సునీత

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి నేటికి 4 సంవ‌త్స‌రాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెల‌తెల వారుతుండ‌గా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మ‌ర‌ణంపై ఉలిక్కిప‌డ్డాయి. తొలుత రెండు మూడు గంట‌ల పాటు అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఒక ప్ర‌త్యేక సందిగ్ధావ‌స్థ నెల‌కొంది. ఓ వ‌ర్గం టీవీ.. గుండెపోటు అని ప్ర‌చారం చేసింది. కానీ, రెండు గంట‌లు గడిచిన త‌ర్వాత‌.. మాత్రమే అది దారుణ హ‌త్య అని తేలింది.

స‌రే.. వివేకా 4వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కుమార్తె, ప్ర‌ముఖ వైద్యురాలు సునీత ఆయ‌న స‌మాధి వ‌ద్ద ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను త‌న తండ్రి హ‌త్య‌పై ఎందుకు పోరాటం చేస్తున్న‌దీ వివ‌రించారు. త‌న తండ్రి హ‌త్య జ‌రిగితే.. సొంత కుటుంబ స‌భ్యులే(పేరు చెప్ప‌లేదు) తేలికగా తీసుకున్నార‌ని.. క‌నీసం జాలి కూడా చూపించ‌లేద‌న్నారు. అంతేకాదు.. ఇవ‌న్నీ రాయ‌లసీమ‌లో కామ‌నే! అని వ్యాఖ్యానించిన‌ట్టు చెప్పారు.

ఇదే త‌న‌లో పౌరుషం పెంచింద‌న్నారు. ఇది కామ‌న్ కాదు.. ప‌క్కా వ్యూహంతోనే జ‌రిగింద‌ని భావించి.. అనేక రూపాల్లో విచార‌ణకు ప్ర‌య‌త్నించాన‌ని.. కానీ, చివ‌ర‌కు కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం ఈ విచార‌ణ‌లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని ఆమె మ‌రోసారి విన్న‌వించారు. ఈ హ‌త్య వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉంద‌ని.. నిగ్గు తేలితే త‌ప్ప‌.. భవిష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండ‌వ‌ని చెప్పారు.

త‌న‌కు ఉన్న అన్ని సందేహాల‌ను అఫిడ‌విట్ రూపంలో కోర్టుకు వివ‌రించిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా సీబీఐ కి కూడా స‌హ‌క‌రిస్తున్న‌ట్టు చెప్పారు. “నా సొంత కుటుంబ స‌భ్యుల‌పైనే ఆరోప‌ణ‌లు చేశాను. ఇది నాకు కూడా బాధ‌గానే ఉంది. కానీ, వారు మానాన్న ను అత్యంత కిరాత‌కంగా చంపేశారు. అందుకే నిజాలు తెలియాలి.. మాపై ఉన్న ఆరోప‌ణ‌లు పోవాల‌నే ఉద్దేశంతో నే న్యాయ‌పోరాటానికి దిగాను” అని సునీత అన్నారు.