ఎంపీ టికెట్ కోస‌మే మా నాన్న‌ను చంపేశారు: సునీత

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాశ్‌ ఇంట్లోనే సునీల్‌యాదవ్ ఉన్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు.

2017లో జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే ఓడించారని, 2019లో వివేకాకు ఎంపీ టికెట్ ఇస్తున్నారనే హత్య చేశారని సునీత సంచ‌ల‌న విష‌యాలు పేర్కొన్నారు. ఎంపీ టికెట్ కోసం హత్య చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే ముందే హత్య గురించి అవినాష్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు.

“మానాన్న‌ మరణంపై అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చాడు. వివేకా ఇంటికి వచ్చిన శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు అవినాష్‌ చెప్పాడు. పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అబద్ధం చెప్పారు. హత్య కాదు.. సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు” అని సునీత పేర్కొన్నారు.

అంతేకాదు.. విచారణకు సహకరించకుండా కోర్టుల్లో అవినాష్ తప్పుడు కేసులు వేస్తున్నాడన్నారు. “నాపై, నా కుటుంబంపై, దర్యాప్తు అధికారులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు. ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాశ్‌ను కాపాడాలని చూస్తున్నా రు. సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారు” అని సునీతారెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.