ద‌ళిత‌బంధు: కేసీఆర్ వార్నింగ్ ఇచ్చే స్థితికి ఎమ్మెల్యేలు!

గ‌త కొన్ని నెల‌లుగా.. తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నా యి. కీల‌క‌మైన ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని వారు దారిమ‌ళ్లిస్తున్నార‌ని.. ఈ ప‌థ‌కంలో ల‌బ్ది పొందాలంటే.. చేతులు త‌డ‌ప‌క త‌ప్ప‌నిప‌రిస్థితి వ‌స్తోంద‌ని.. ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై ఇటీవ‌ల కాలంలో అనేక మీడియా సంస్థ‌లు వార్త‌లు రాస్తూనే ఉన్నాయి.

కొంద‌రు అధికారుల‌తో కుమ్మ‌క్క‌యితే.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు..నేరుగానే ఈ ప‌థ‌కంలో నిధులు బొక్కు తున్నార‌ని కూడా ఆరోప‌ణ‌లు వినిపించాయి. మ‌రోసారి అధికారంలోకి తెచ్చిపెట్టే కీల‌క‌మైన ప‌థ‌కంగా భావిస్తున్న ద‌ళిత‌బంధు ఆరోప‌ణ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. అయితే.. ఏయే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నార‌నే వివ‌రాలు సీఎం కేసీఆర్‌కు చేరిపోయాయి. దీంతో ఆయ‌న నేరుగానే వారిని హెచ్చ‌రించారు.

దళితబంధు అమలు తీరుపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. దళితబంధు కోసం కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్న వైనాన్ని ఆయ‌న క‌ళ్ల‌కు క‌ట్టారు. వరంగల్‌, ఆదిలాబాద్ జిల్లాల‌లో కొందరు డబ్బులు వసూలు చేశారని.. ఆ వివ‌రాలు.. అన్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని కేసీఆర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంతో ఎమ్మెల్యేలు గుడ్లు తేలేశారు. అయితే.. ఈ స‌మ‌యంలో కేసీఆర్ వారిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు కానీ, వార్నింగ్ అయితే ఇచ్చారు.

మళ్లీ ఇలాంటి నొక్కుళ్లు రిపీట్ అయితే..ఊరుకునేది లేద‌ని ఎమ్మెల్యేలను కేసీఆర్‌ హెచ్చరించారు. “ద‌ళిత బంధు.. మ‌న‌ల్ని కాపాడే ప‌థ‌కం. ఏమ‌నుకుంటున్న‌రు? ” అని ఎమ్మెల్యేల‌ను సీఎం నిగ్గ‌దీసిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఇప్ప‌టికైనా ఎమ్మెల్యేలు త‌మ దారి మార్చుకుంటారో లేదో చూడాలి. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అత్యంత ర‌హ‌స్యంగా చేసిన ఈ హెచ్చ‌రిక‌లు తాజాగా లీక్ అయ్యాయి.