#బై బై మోదీ…

కల్వకుంట్ల కవితపై కేసుతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వైరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఎవరెంత అవినీతి చేశారనే చర్చ కూడా జోరందుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తున్న తరుణంలోనే హైదరాబాద్లో కొన్ని పోస్టర్లు, ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి.
ED, CBI బిజెపి బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ పలువురు నేతల ఫోటోలు ఆ పోస్టర్లలో దర్శనమిస్తున్నాయి.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు CBI, ED రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ వెలిసిన ఫ్లెక్సీలను జనం ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బిజెపి నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు కనిపిస్తున్నాయి.

కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్ కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లలో రాతలు కనిపిస్తున్నాయి. పైగా నిజమైన రంగులు వెలిసిపోవూ అంటూ కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి. చివర్లో చివర్లో బై బై మోదీ అంటూ హాష్ టాగ్ తో పోస్టర్లు ఉండటంతో జనానికి తెగ ఇంట్రస్ట్ పుట్టేస్తోంది.