ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని ఫలితాలను ఇపుడు దేశం గమనిస్తుంది. బాధ్యతగా వ్యవహారించాల్సిన న్యాయమూర్తులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యల్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తప్పు పట్టారు. దీని మీద చర్చ జరగాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత అనే అంశం మీద నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు.

జడ్జీల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని, జడ్జీలను ఎంపిక చేసినప్పుడు సదరు వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను వెల్లడించడం లేదని, దాని వల్ల తగని వ్యక్తులు ఎంపికవుతున్నారని చెప్పారు. అలాంటి జడ్జీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ గౌరవం దెబ్బతీసేలా వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొలిజియం తీసుకునే నిర్ణయాలపై కొన్ని కారణాలను పేర్కొనడం జరిగేదని, ఇప్పుడది లేకుండా పోయిందన్నారు.

న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలో సంచలనంగా మారాయి. కొందరు న్యాయవాదులు ఆయన కామెంట్స్ ని స్వాగతిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికి అత్యధిక శాతం న్యాయమూర్తులు మౌనంగా వుంటున్నారని, ఇప్పుడు ఉజ్జల్ భుయాన్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడ్డం ద్వారా పిల్లి మెడలో గంటకట్టారని చెబుతున్నారు. ఈ చర్చ ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సి వుంది.