టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ రెండు సీట్లే 175 సీట్లకు ప్రీఫైనలా?

ఏపీలో రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో జరగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు స్థానాల్లోనూ బహుముఖ పోటీ కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూల్‌, కడప, అనంతపురం జిల్లాలను కలిపి పశ్చిమ రాయలసీమలో… ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలిపి తూర్పు రాయలసీమ స్థానంలో పోటీ జరుగుతోంది.

మార్చ్ 13వ తేదీన ఓటింగ్‌ జరగనుండగా, 16వ తేదీ నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్లలో ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం ఉందన్న మాట వినిపిస్తుండడంతో ఈ రెండు టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో ఫలితమే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 175 సీట్ల ఫలితాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. ఒకరకంగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను ప్రీఫైనల్ ఎగ్జామ్‌లా భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఈ రెండు సీట్లలో వైసీపీ మద్దతు ఉన్న అభ్యర్థులే గెలిచేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

పశ్చిమ రాయలసీమలో చాలా మంది అభ్యర్దులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా నలుగురు అభ్యర్ధుల మధ్య పోటీ నడుస్తోంది. ఇక్కడి సిట్టింగ్‌ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కత్తి నరిసింహారెడ్డినే మళ్లి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆయన మాతృసంఘం ఎస్‌టియుకు గట్టి మద్దతే ఉంది. దీనికి తోడు మరో పెద్ద సంఘం యుటిఎఫ్‌ కూడా కత్తి నరిసింహారెడ్డికే మద్దతునిస్తోంది.

అయితే కత్తి నరిసింహారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో ప్రభుత్వంతో గట్టిగా పోరాడి ఉపాధ్యాయులకు కావాల్సినవి తీసుకురాలేదన్న వ్యతిరేకత కొంత వ్యక్తమౌతోంది. దీనికితోడు కత్తి నరిసింహారెడ్డి గత సారి గెలుపుతో కీలక పాత్ర వహించిన హెడ్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ జివి నారాయణ రెడ్డి ఈసారి పోటీలో నిలిచారు. దీనికితోడు గతంలో పిడిఎఫ్‌ అభ్యర్ధి కత్తి నరిసింహారెడ్డికి మద్దతునిచ్చిన సంఘాల్లో స్కూల్‌ అసిస్టెం ట్ల అసోసియేషన్‌, పిఇటి అసోసియేషన్‌ మినహా మిగిలిన సంఘాలన్నీ దూరమయ్యాయి.

మరోవైపు గవర్నమెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌, పండిత పరిషత్‌, ఎంఇఓ అసోసియేషన్‌ పిడిఎఫ్‌ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక ఎపిటిఎఫ్‌ తరుపున చలమల అనిల్‌కుమార్‌ రెడ్డి అనే అభ్యర్ధి పోటీలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పిడిఎఫ్‌కు కాకుండా తమకే పడుతుందని, ఉపాధ్యాయుల నమ్మకం తమపైనే ఉందని ఎపిటిఎఫ్‌ చెబుతోంది. కాగా అధికార పక్షం అభ్యర్దిగా ప్ర యివేట్‌ స్కూళ్ల సంఘం ప్రతినిధి రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన విజయం కోసం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. కడప ఆర్జేడీగా ఉన్న ప్రతాప్‌రెడ్డి అధికార దుర్వినియోగం చేసి ఈ అభ్యర్ధి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. కాగా నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రయివేట్‌ టీచర్లు చెరి సగంగా ఉన్నారు. కాగా ప్రయివేట్‌ టీచర్లను ఆకట్టుకోవడంలో అధికార పక్షం ముందు వరుసలో ఉంది. ప్రయివేట్‌ స్కూళ్ల వారీగా మీటింగ్‌లు పెట్టి తమ అభ్యర్ధికి ఓటేయ్యాలని చెబుతున్నారు.

ఒకవేళ ప్రయివేట్‌ టీచర్లలో పెద్ద సంఖ్యలో అధికార పక్షం వైపు మొగ్గు చూపితే రామచంద్రారెడ్డినే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా స్వతంత్య్ర అభ్యర్ధి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి అధికారపక్ష అభ్యర్ధికి గట్టిపోటీదారుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి కత్తి నరిసింహారెడ్డిపై అతి తక్కువ ఓట్ల తేడాతో ఒంటేరు ఓడిపోయారు. అప్పటి నుండి ఉపాధ్యాయుల మధ్యలోనే ఉండి ఎప్పటికప్పుడు వారి సమస్యలపై పోరాడారు. ఈయనకు గతంలో ఓడిపోయారనే సానుభూతి ఉంది. అదీకాక ఉపాధ్యాయ సంఘాల్లో అత్యధిక సంఘాలు ఈయనకు మద్దతునిస్తున్నాయి.

తూర్పు రాయలసీమ స్థానంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. అధికారపక్షం అభ్యర్దిగా ప్రయివేట్‌ స్కూళ్ల, కాలేజీల యజమాని పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి, పిడిఎఫ్‌ అభ్యర్దిగా యుటి ఎఫ్‌కు చెందిన బాబూ రెడ్డి, స్వతంత్ర అభ్యర్దిగా ఎల్‌సి రమణారెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న 26 వేల మంది ఉపాధ్యాయ ఓటర్లలో సగం మంది ప్రయివేట్‌ టీచర్లే ఉన్నారు.

వీరిపై అధికార పక్షం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే ఇప్పటివరకు టీచర్ల ఎమ్మెల్సీ స్తానాల్లో ప్రయిట్‌ స్కూళ్ల యజమానులు గెలిచిన దాఖలాలు లేవు. మరోవైపు పిడిఎఫ్‌ సిట్టింగ్‌ స్థానమైన ఈ స్థానంలో గత మూడుసార్లు విఠపు బాలసుబ్రమణ్యం గెలిచారు. ఇప్పడు ఇక్కడ పిడిఎఫ్‌ అభ్యర్ధిగా యుటిఎఫ్‌కు చెందిన బాబురెడ్డి పోటీలో ఉన్నారు. అయితే గత మూడు సార్లు యుటిఎఫ్‌ను గెలిపించాం కాబట్టి ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉపాధ్యాయుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదీకాక బాబురెడ్డికి ఎస్‌టియు మద్దతు తెలిపినప్పటికీ వారి ఓట్లన్నీ ఈయనకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది స్వతంత్ర అభ్యర్ది ఎల్‌సి రమణారెడ్డి పుంజుకుంటున్నారు. ఈయనకు పెద్ద సంఘమైన సిపిఎస్‌ ఉపాధ్యాయ సంఘం తోపాటు గుర్తింపు సంఘమైన, టిడిపికి అనుబంధ సంఘమైన టిఎన్‌యుఎస్‌ కూడా మద్దతునిచ్చాయి. ప్రయివేట్‌ స్కూళ్లలో సైతం టిడిపికి అనుకూలమైన ప్రయివేట్‌ స్కూళ్లను గుర్తించి అక్కడి టీచర్లతో మాట్లాడి రమణారెడ్డికి మద్దతు కూడగడుతున్నారు. స్వతహాగా ఈయన చాలా మంచి వాడనే పేరు కూడా ఉంది. గతంలో ఈయన ఎస్‌టియులో పనిచేసి ఉండడంతో వారి ఓట్లు ఈయనకు బదిలీ అయ్యే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తూర్పు రాయలసీమలో త్రిముఖ పోటీ నెలకొంది.