కవితకు ఈడీ నోటీసులు

అనుకున్నట్లే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే ఇప్పుడు ఈడీ ఆమె వెంట పడుతోంది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.

లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత కవితకు సమన్లు ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించిన నేపథ్యంలో కవితకు ఈడీ సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కవితను,పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే కవిత మరిన్ని కష్టాల్లో చిక్కుకోవడం ఖాయమనిపిస్తోంది. పిళ్లై దాదాపుగా అప్రూవర్ గా మారినట్లేనని భావిస్తున్నారు..

నిజానికి పదే తేదీన ఢిల్లీలో కవిత ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళా బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించాలని కోరుతూ ఆమె ఉద్యమించబోతున్నారు. అంతకు ముందే గురువారం ఆమెను ఈడీ విచారణకు పిలిచింది.

కవిత అరెస్టు ఖాయమన్న వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాంను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి.. అందులో ఏ సంస్థ కవిత అరెస్టును ముందుగా చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేం. గురువారమే ఆమెను ఈడీ అరెస్టు చేసిన పక్షంలో తర్వాత సీబీఐ కస్టడీ కూడా కోరే అవకాశం ఉండొచ్చు.

టైమ్ అడుగుతున్న కవిత

గురువారం హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ పంపినట్లు సమాచారం. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని మరో రోజున వస్తానని చెప్పారట. మహిళా బిల్లుపై 10న ఢిల్లీ ధర్నా ఉన్నందున ఆ తర్వాత ఎప్పుడైనా వస్తానని కవిత చెప్పారని అంటున్నారు…