మోడీపై మూకుమ్మడి దాడి స్టార్ట్

ప్రతిపక్షాల నేతలు నరేంద్రమోడీపై లేఖా యుద్ధాన్ని మొదలుపెట్టారు. దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయటంపై నలుగురు ముఖ్యమంత్రులు మోడీకి లేఖ రాశారు. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి విపక్షాలను వేధింపులకు గురిచేయటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తు ముఖ్యమంత్రులు కేసీయార్, మమతాబెనర్జీ, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ కూడా సంతకాలు చేశారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియా అరెస్టును వీళ్ళంతా ఖండించారు. మనీష్ అరెస్టు కేవలం కేంద్రప్రభుత్వం కక్షసాధింపులో భాగమని మండిపడ్డారు. దర్యాప్తు సంస్ధల స్వయంప్రతిపత్తిని కేంద్రప్రభుత్వం హరించేస్తోందని దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్ధలకున్న ప్రతిష్టను మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పూర్తిగా దిగజార్చేసినట్లు లేఖలో రెచ్చిపోయారు. పేరుకు మాత్రమే దర్యాప్తు సంస్ధలు స్వయంప్రతిపత్తి ఉన్న సంస్ధలన్నీ ఆచరణలో మాత్రం అంతా ప్రభువులు చెప్పినట్లే నడుచుకుంటున్నాయని ఆరోపించారు.

వివిధ రాష్ట్రాల్లో విపక్షాలను దర్యాప్తు సంస్ధలను అడ్డం పెట్టుకుని కేంద్రప్రభుత్వం ఏ విధంగా వేధిస్తున్నదనే విషయాన్ని వీళ్ళు లేఖలో ప్రస్తావించారు. 2014 నుండి దర్యాప్తుసంస్ధలకు సొంత ఐడెంటి అనేది లేకుండా పోయిందని మండిపోయారు. ఝార్ఖండ్ లో హేమంత్ సోరేన్, కర్నాటకలో డీకే శివకుమార్ లాంటి నేతలతో పాటు బీహార్ నితీష్ కుమార్ మద్దతుదారులను, మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని, ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తదితరులపై దర్యాప్తు సంస్ధలు కేసులు పెట్టి అరెస్టులు చేసింది.

ఆప్ మంత్రులను, డీకే శివకుమార్ ను అయితే పదే పదే విచారణల పేరుతో రోజుల తరబడి సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు విచారణకు పిలిచింది వాస్తవమే. సోనియాగాంధీ, రాజీవ్ గాంధీలను కూడా రోజుల తరబడి సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. నిజంగానే ఎవరైనా అవినీతికి పాల్పడుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందే అనటంలో సందేహంలేదు. అంతేకానీ రోజులు, నెలల తరబడి విచారణపేరుతో వేధింపులకు గురిచేయటం మాత్రం అభ్యంతరకరమే. ఇపుడు దర్యాప్తు సంస్ధలు చేస్తున్నది ఇదే కాబట్టే ప్రతిపక్షాల అధినేతలు మోడీకి లేఖ రాసింది.