“నువ్వు డైపర్స్ వేసుకునేటప్పుడు పుట్టిన పార్టీ”

దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలుపై తెలుగు తమ్ముళ్లు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మేం ఎలా పోటీ చేయాలో నువ్వు చెప్పేదేంటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన నేతల కౌంటర్లు ఎలా ఉన్నా.. టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా రియాక్టు అయ్యారు. జగన్ కు సవాలు చేసేంత సీన్ లేదన్న ఆయన.. “నువ్వు డైపర్స్ వేసుకునేటప్పుడు పుట్టిన పార్టీ” అంటూ మండిపడ్డారు.

చరిత్ర సృష్టించిన పార్టీపై సవాళ్లు చేయడమా? అని ప్రశ్నించిన ఆయన.. చరిత్ర తెలుసుకొని సవాలు చేస్తే బాగుండేదన్నారు. “నువ్వు సవాలు విసిరేంత సీన్ నీకు లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదో చెప్పే ధైర్యం ఉందా? పదో తరగతి ఫెయిల్ కావటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోలేదు” అంటూ ఫైర్ అయ్యారు.

నెల్లూరు యాసలో మాట్లాడే ఆనం మాటల్లో రిథమ్ ఉండటం.. ఆయన మాటలు వినేలా ఉండటం తెలిసిందే. మిగిలిన తెలుగు తమ్ముళ్లతో పోలిస్తే.. ఆనం మాటలు కాస్తంత భిన్నమని చెబుతుంటారు. అయితే..తాజా ఎపిసోడ్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం గమనార్హం. ఆనం మాటలకు బదులిస్తూ.. 1983 నుంచి 2019 ఎన్నికల వరకు ఏయే పార్టీలతో టీడీపీ పొత్తుపెట్టుకుందో చెప్పుకుంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు పలువురు నెటిజన్లు.

దీనిపై మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. తెలుగుదేశం మీద ఫైర్ అయ్యే ముందు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది టీఆర్ఎస్.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవటం వల్లనే కదా? ఆ విషయాన్ని ఎలా మర్చిపోతారు? ఒంటరిగా పోటీ చేయాలని సవాలు విసిరే జగన్.. మరి.. వాళ్ల నాన్న ఆ పని ఎందుకు చేయలేకపోయారో చెప్పాలంటున్నారు.

అంతేకాదు.. జగన్ తనకు తానుగా ఎదిగిన నేత కాదని.. తన తండ్రి పేరును.. బొమ్మను పెట్టుకొని ప్రజల్లోకి వచ్చాడే తప్పించి.. సొంతంగా చేసిందేమీ లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి.. ఆ పార్టీ నేతల్ని వెంట పెట్టుకొని మాట్లాడే జగన్ మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటూ ఘాటుగా రియాక్టు అవుతున్నారు. సీఎం జగన్ సవాలు చేయటం ఏమో కానీ.. ఆయన మాటలపై మాత్రం భారీ ఎత్తున చర్చ పేరుతో రచ్చ జరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.