జ‌గ‌న‌న్నా.. మ‌న ‘బాదుడు’ మ‌నోళ్ల‌కే న‌చ్చ‌లేదే!!

వైసీపీ పాల‌న‌లో ప‌న్నుల బాదుడు పెరిగిపోయింద‌ని..ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌లు చేశాయి. ఇంకా చేస్తున్నాయి. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నేత‌లు.. రోడ్డెక్కారు. అయితే.. ఇదంతా కూడా.. మేం 151 మందిని గెలిచామ‌నే అక్క‌సుతోనే చంద్ర‌బాబు క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుంటున్నార‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల వంటివారు కామెంట్లు చేశారు. ఇక‌, ఇత‌ర నేత‌లు కూడా మీ హ‌యాంలో ప‌న్నులు వేయ‌లేదా? అని ఎదురుదాడి చేశారు.

స‌రే.. ఈ విష‌యాన్ని ఇలా ఉంచితే..ఇప్పుడు సొంత పార్టీ నేత‌లే.. అంటే వైసీపీ క‌ర‌డుగ‌ట్టిన నాయ‌కులే రోడ్డెక్కారు. ఏకంగా.. ముఖ్యమంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనే కార్పొరేటర్లు.. ఉద్య‌మించారు. వీరేమీ.. ఒక‌రిద్ద‌రో కాదు.. ఏకంగా 40 మంది కార్పొరేట‌ర్లు.. “ఇదేం బాదుడు జ‌గ‌న‌న్నా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక‌పోతున్నాం” అని నిప్పులు చెరుగుతున్నారు. వివిధ రకాల పన్నుల పేరుతో ప్రజల ముక్కు పిండి డబ్బులను వసూలు చేస్తున్న కడప నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేదా? వారు నిల‌దీస్తున్నారు.

ఏకంగా 40 మంది వైసీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్‌ను నిల‌దీశారు. కడపలో జరుగుతున్న పన్నుల వ‌సూళ్ల విధానం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ సంఘటనపై సీఎం జగన్ కూడా స్పందించాలని కార్పొరేటర్లు లేఖలు రాయడం జిల్లావ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. గత కొంతకాలంగా కడప నగరపాలక సంస్థ అధికారులు వివిధ రకాల పన్నుల పేరుతో ముక్కు పిండి ప్రజల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారు.

దీంతో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లే జీర్ణించుకోలేకపోతున్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉంటే అందులో 48 మంది వైసీపీ కార్పొరేటర్లే ఉన్నారు. వారిలో దాదాపు 40 మంది ఈ ప‌న్నుల వ‌సూళ్ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మున్సిపల్ కమిషనర్ తో వివాదానికి దిగారు. కార్పొరేటర్లకు తెలియకుండానే అన్నీ జరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఇంటికి చెత్త పన్ను 40 రూపాయలు, 60 రూపాయలుగా పాలకవర్గం తీర్మానించి పంపినప్పటికీ.. అధికారులు మాత్రం 90 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆక్రోశం వ్య‌క్తం చేశారు. 2019-20 సంవత్సరంలో కరోనా సందర్భంగా వ్యాపారాలు జరగని వారికి కూడా ట్రేడ్ లైసెన్స్ పేరుతో భారీగా పెనాల్టీ వేయడం సరికాదన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులతో పాటు ఖాళీ స్థలాలకు కూడా వీఎల్టీ పేరులో టాక్స్ భారీగా వేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. జ‌గ‌న‌న్నా.. బాదుడుపై మ‌నోళ్లే.. బాదేస్తున్నారే! అని కామెంట్లు చేస్తున్నారు.